ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ అంటే.. విజయ్ దేవరకొండ(vijay Devarakonda), రష్మిక(rashmika)లే. కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెద్దగా హడావుడి లేకుండా రాజస్థాన్లోని ఉదయ్పూర్కు వెళ్లి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకుంది ఈ జంట. పెళ్లి జరిగే వరకు మీడియాలో పెద్దగా హడావుడి లేదు. కానీ వివాహం పూర్తయ్యాక మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వాళ్లిద్దరి పెళ్లి ముచ్చట్లు, ఫొటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి.
తన స్వస్థలం అయిన మహబూబ్నగర్కు రష్మికతో కలిసి వెళ్లిన విజయ్ పూజలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా ఊరంతటికి భోజనాలు పెట్టించాడు. తర్వాత హైదరాబాద్కు వచ్చి ఫ్యాన్స్ మీట్లో పాల్గొందీ జంట. ఇక బుధవారం హైదరాబాద్లోనే భారీ ఎత్తున రిసెప్షన్ జరిగింది. వివిధ ఇండస్ట్రీల నుంచి సినీ ప్రముఖులతో పాటు స్థానిక రాజకీయ నాయకులూ ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఇలా వారం రోజుల పాటు తీరిక లేకుండా గడిపింది విజయ్, రష్మిక జోడీ. దీంతో ఇద్దరూ బాగా అలసిపోయారు. విజయ్కి జ్వరం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న రిసెప్షన్లో కూడా అతను జ్వరంతోనే ఉన్నాడట. ఐతే బుధవారంతో అన్ని కార్యక్రమాలూ పూర్తి కావడంతో.. ఇక మీడియాకు, అభిమానులకు పూర్తిగా దూరంగా ఉండబోతున్నారు విజయ్, రష్మిక. ఫ్యాన్స్ మీట్లో విజయ్ మాట్లాడుతూ.. ఈ రోజుతో అంతా అయిపోతుందని, ఇక తామిద్దరం అండర్గ్రౌండ్లోకి వెళ్లిపోతామని చెప్పడం విశేషం.
రెండు మూడు రోజుల విరామం తర్వాత విజయ్, రష్మిక కలిసి ‘రణబాలి’ చిత్రీకరణకు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం సెప్టెంబరు 11న రిలీజ్ కావాల్సి ఉంది. ఏడాది చివర్లో విజయ్ మరో చిత్రం ‘రౌడీ జనార్ధన’ విడుదల కావాల్సి ఉంది. రెండూ భారీ చిత్రాలే. వీటి కోసం విజయ్ వరుసగా షూట్లో పాల్గొనాల్సి ఉంది. కొత్త జంటకు అసలు హనీమూన్కు వెళ్లే అవకాశం ఉంటుందా లేదా అన్నది కూడా సందేహమే. ఒకవేళ వెళ్లినా అది షార్ట్ టూరే అవుతుంది.