ప్రకృతి ప్రకోపం ఇప్పుడు ఏకంగా ఆ దేవదేవుడి ఉత్సవాలనూ వదలడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి శోభ సంతరించుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. ఎల్ నినో (El Nino) ప్రభావం వల్ల సరిగ్గా వర్షాలు కురవక, రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో రిజర్వాయర్లు, చెరువులు, నదులు అన్నీ ఎండిపోయి బోసిపోయాయి. తాగు, సాగు నీటికే కటకటలాడే దుస్థితి దాపురించింది. సరిగ్గా పండుగ వేళ ఈ కరువు ఛాయలు భక్తులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి.
అనంతపురం(Anantapur) జిల్లా సింగనమల నియోజకవర్గ పరిధిలోని యల్లనూరు మండలంలో ఈ విపరీత పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. నదిలో కనీసం మోకాతు నీరు కూడా లేకపోవడంతో, స్థానిక భక్తులు గణేష్ నిమజ్జనం కోసం పడిన పాట్లు హృదయవిదారకంగా ఉన్నాయి. ప్రవహించాల్సిన చిత్రావతి నది కాస్తా ఎండిపోయి ఇసుక మేటలతో దర్శనమిచ్చింది. చేసేది లేక భక్తులు దిక్కుతోచని స్థితిలో తాము పూజించిన గణపతి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడానికి బదులుగా, ఆ ఎండిపోయిన నదిలోనే వదిలిపెట్టి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సామాన్యులకే కాదు ఏకంగా ఆ ఏకదంతుడికీ ఎల్ నినో కష్టాలు తప్పలేదంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ దయనీయ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, దొరికిందే సందు అన్నట్లుగా ఇది కేవలం ప్రకృతి వైపరీత్యం కాదని, ప్రభుత్వ అసమర్థతేనంటూ వైసీపీ రాజకీయ ఆరోపణలకు తెరలేపింది. గణేష్ ఉత్సవాల సమయంలో నిమజ్జనానికి నీటి వసతి కల్పించడంలో అధికార కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ విపక్ష వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఏదేమైనా వర్షాభావ పరిస్థితులు ఒకవైపు అన్నదాతలను అల్లాడిస్తుంటే, మరోవైపు పండుగ వేళ గణపయ్య నిమజ్జనాన్ని(Ganesh Immersion) కూడా రాజకీయ రగడగా మారుస్తున్నాయి.