ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పార్టీ మారుతారంటూ జోరుగా సాగిన ప్రచారానికి చెక్ పెట్టేందుకు వైఎస్సార్సీపీ(YSRCP) అధినాయకుడు మాస్టర్ ప్లాన్ అమలు చేశారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పార్టీ వీడకుండా ఉండేందుకు ఏకంగా 'ఫ్యామిలీ ప్యాకేజీ'ని తెరపైకి తెచ్చినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
ఇందులో భాగంగానే బొత్స కుటుంబానికి భారీ పదవుల గాలం వేస్తున్నారు. ఇప్పటికే బొత్స కుమార్తె అనూషకు భీమిలి సమన్వయకర్త బాధ్యతలు అప్పగించగా.. మరోవైపు చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) పోటీని ఖారారు చేయడం, ఆయన భార్య బొత్స ఝాన్సీ లక్ష్మికి ఎంపీ టికెట్, అలాగే కుమారుడికి మరో అసెంబ్లీ స్థానం కేటాయించేలా అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి పూర్తి రాజకీయ విశ్రాంతి తీసుకోవాలనుకున్న బొత్సను, పరిస్థితులు మళ్లీ ఫ్యామిలీ మొత్తం బరిలో దిగేలా చేశాయి.
అయితే, జగన్(Jagan) వేసిన ఈ ఎత్తుగడ ఒకవైపు చర్చనీయాంశం కాగా.. మరోవైపు ఉత్తరాంధ్రలో మరో పెద్ద సమస్య తెరపైకి వచ్చింది. ఇటీవల కాలంలో వైఎస్సార్సీపీని వీడి టీడీపీ(TDP)లోకి వెళ్లిన చిన్న శీను లేని లోటును ఈ కుటుంబం భర్తీ చేయగలదా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది. క్షేత్రస్థాయిలో కేడర్ను నడిపించడం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, నియోజకవర్గాల వ్యూహాలు అన్నీ చిన్న శీను కనుసన్నల్లోనే నడిచేవి. ఇప్పుడు ఆ కీలకమైన ఇంజిన్ పక్కన లేకపోవడంతో, కేవలం కుటుంబ సభ్యుల పేరిట ఎన్ని టికెట్లు తెచ్చుకున్నా క్షేత్రస్థాయిలో గెలుపు సాధ్యమవుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. పదవుల పంట పండినప్పటికీ, బొత్స కుటుంబం ఈ సవాల్ను ఎలా దాటుతుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.