ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలతో మమేకమవుతూ మీకు నేనున్నాను అని భరోసానిస్తూ గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పెన్షన్ల పంపిణీకి నేరుగా ముఖ్యమంత్రి వెళ్లడం ఆ ఇంట్లో స్వయంగా టీ చేయడం వంట చేయడం వంటి పరిణామాలు ప్రజలలో చంద్రబాబు ఒకరు ఆయన మనమనిషి అనేలా చేశాయి. గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పరదాల మాటున ప్రజలకు దూరంగా ఉంటే చంద్రబాబు మాత్రం ఇంట్లో సొంత మనిషి లాగా కలిసిపోతున్న వైనంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విశాఖపట్నం ఆర్కే బీచ్ లో పర్యటించిన చంద్రబాబు అక్కడ మురి మిక్చర్ ను టేస్ట్ చేశారు.
వ్యాపారం ఎలా సాగుతుది అంటూ మిక్చర్ అమ్ముతున్న మహిళను అడిగి తెలుసుకున్నారు. అయితే, తాను ఒంటరి మహిళను అని, తనకు జీవనాధారం ఈ బండి మాత్రమేనని ఆమె చెప్పారు. దీంతో ఆమెకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని సంబంధిత అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఈ పరిణామానికి సదరు మహిళ హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపింది. ఇక, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ఆర్కే బీచ్ లో జీవీఎంసీ చేపట్టిన సాగర స్వచ్ఛత కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో సముద్ర తీరం పరిశుభ్రంగా ఉంచేందుకు చేపడుతున్న కార్యక్రమాలను స్వయంగా చంద్రబాబు పరిశీలించారు. పెద్ద జాలరి పేటలో ఏర్పాటుచేసిన ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ పైలట్ సైట్ ను వర్చువల్ గా చంద్రబాబు ప్రారంభించారు. సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ చేసే ప్రక్రియ వేగవంతం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.