వైఎస్సార్ కుటుంబంలో జగన్, షర్మిల మధ్య నెలకొన్న ఆస్తి తగాదాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అన్నాచెల్లెళ్ల మధ్య దూరం తగ్గుతుందనుకున్న ప్రతిసారీ, వారి మధ్య మరింత అగాధం పెంచుతున్న పరిణామాలే తెరపైకి వస్తున్నాయి. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తన గారాల పట్టి అంజలి రెడ్డి వివాహ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంటే... సరిగ్గా అదే సమయానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి విదేశీ పర్యటనకు సిద్ధమవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
షర్మిల తన కుమార్తె అంజలి రెడ్డి(Anjali Reddy) నిశ్చితార్థం, వివాహ తేదీలను ఇటీవల ప్రకటించారు. డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో వివాహం నిశ్చయమైన నేపథ్యంలో, షర్మిల తన కూతురితో కలిసి పులివెందులకు వెళ్లి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధిపై తొలి పెళ్లి పత్రికను ఉంచి నివాళులు అర్పించారు. నవంబర్ 25వ తేదీన పెళ్లి, డిసెంబర్ 5న హైదరాబాద్లో భారీ రిసెప్షన్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఈ నెల 24 వ తేదీన హైదరాబాద్, 25 వ తేదీన బెంగళూరు లో నిశ్చితార్ధం జరుగుతుంది. ఈ వేడుకల కోసం షర్మిల బంధువులను ఆహ్వానిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
అయితే, కుటుంబంలో ఇంత పెద్ద వేడుక జరుగుతున్న కీలక తరుణంలోనే జగన్(Jagan) యూరప్ టూర్ షెడ్యూల్ ఖరారు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో సుమారు 25 రోజుల పాటు పర్యటనకు వెళ్లేందుకు ఆయన సీబీఐ కోర్టు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల వేడి ఊపందుకుంటున్న తరుణంలో, అదీ సొంత మేనకోడలి పెళ్లి సమయానికే ఫారిన్ టూర్ ప్లాన్ చేసుకోవడంపై పార్టీ శ్రేణుల్లోనూ రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.
తల్లి విజయమ్మ(Vijayamma) చొరవ తీసుకొని అన్నాచెల్లెళ్ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదనేందుకు ఈ పరిణామమే నిదర్శనమనే చర్చ జరుగుతోంది. మేనకోడలి పెళ్లికి దూరంగా ఉండాలన్న ఉద్ధేశంతోనే జగన్... దేశంలోనే లేకుండా విదేశీ పర్యటనను అడ్డం పెట్టుకుంటున్నారనే ప్రచారం పులివెందుల వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.