2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ కు రాజీనామా చేయకుండానే 2024 లోక్ సభ ఎన్నికలలో సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేయడంతో ఈ వ్యవహారాన్ని సవాల్ చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. దానంపై స్పీకర్ అనర్హత వేటు వేయకపోవడంతో కోర్టు ను ఆశ్రయించామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే దానంపై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేసింది.
ఈ క్రమంలోనే కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే. అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైతే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి ఎవరు దిగుతారు అన్నది కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. దానం నాగేందర్ మళ్లీ ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు.
పార్టీ ఫిరాయింపులను గతంలో ప్రోత్సహించిన బీఆర్ఎస్ ఇప్పుడు దానం విషయంలో విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల సంస్కృతిని మొదలుపెట్టిందే కేసీఆర్ అని విమర్శించారు. టీడీపీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ తరఫున గెలిచిన సబితా ఇంద్రారెడ్డి లను అప్పటి టీఆర్ఎస్ లో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చింది కేసీఆర్ అని విమర్శించారు. అందుకే దానం కేసులో కోర్టు తీర్పు కేసీఆర్ కు చెంపపెట్టు అని ఆయన అన్నారు.