భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన తర్వాత మోదీ ప్రసంగిస్తూ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రన్ వే భోగాపురం విమానాశ్రయం అని, ఏపీ యువత భవిష్యత్తుకు కొత్త లాంచ్ ప్యాడ్ ఇదని మోదీ అన్నారు. విమానాశ్రయాల పేర్లు ఒక కుటుంబానికి సంబంధించినవిగా ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి మార్చామని ఆయన చెప్పారు.
అయోధ్యలో విమానాశ్రయానికి వాల్మీకి పేరు పెట్టామని, పంజాబ్ లో విమానాశ్రయానికి సంత్ రవిదాస్ పేరు పెట్టామని, భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని అన్నారు. రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేసేందుకు18 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. 13 వేల మంది గిరిజన మహిళలు చేసిన థింసా నృత్యం ఒక రికార్డు అని కొనియాడారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ కు నాంది పలికిన సీఎం చంద్రబాబు విజన్ కు అభినందనలు తెలిపారు. ఉడాన్ ద్వారా విమానాయన రంగంలో పెను మార్పులు తెచ్చామని, పేద, మధ్యతరగతి ప్రజల కల నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. 12 ఏళ్ల కాలంలో 92 విమానాశ్రయాలు నిర్మించామని తెలిపారు.