తిరుపతి(Tirupati) రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఒక సంచలన వార్త తీవ్ర చర్చనీయాంశమైంది. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు క్రియాశీలక రాజకీయాలకు, భవిష్యత్ ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. గడిచిన ఏడాది కాలంగా ఆయనను వేధిస్తున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. గత ఆరు నెలలుగా ఆయన పార్టీ కార్యకలాపాలకు కూడా పూర్తిగా దూరంగా ఉండటం ఈ ఊహాగానాలకు మరింత బలమిస్తోంది.
కేవలం అనారోగ్య సమస్యలే కాకుండా, స్థానిక జనసేన నేతలతో పొసగకపోవడం, పార్టీలో తలెత్తిన కొన్ని అంతర్గత విభేదాలు కూడా ఆయన ఈ యోచన చేయడానికి కారణమని తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తన రాజకీయ వారసుడిగా తన అన్న కుమారుడిని తెరపైకి తెచ్చే అవకాశం ఉందంటూ జనసేన వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు(MLA Arani Srinivasu) అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఇకపోతే ఆరణి శ్రీనివాసులు రాజకీయ ప్రయాణం ఎన్నో మలుపులు, ఒడుదొడుకులతో సాగింది. ఆయన 2009లో ప్రజారాజ్యం(Praja Rajyam) పార్టీ ద్వారా చిత్తూరు నుంచి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సి.కె. బాబు చేతిలో కేవలం 1,710 ఓట్ల స్వల్ప తేడాతో ఆయన ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన, కొంతకాలం టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
అనంతరం రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2014 ఏప్రిల్లో టీడీపీ(TDP)ని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున చిత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, పట్టువదలని విక్రమార్కుడిగా నియోజకవర్గంలో పట్టు నిలుపుకున్నారు. చివరకు 2019 ఎన్నికలలో చిత్తూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
వైఎస్సార్సీపీ(YSRCP)లో నియోజకవర్గ ఇన్చార్జ్ మార్పు వ్యవహారంతో పార్టీ నాయకత్వంతో ఆయనకు విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో 2024 మార్చి 3న జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఆయన భేటీ అయ్యారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన వైఎస్సార్సీపీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వైసీపీ వేటు వేసిన వెంటనే, పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన అధికారికంగా జనసేన పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా తిరుపతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇలా ఉత్కంఠభరితంగా సాగిన ఆయన రాజకీయ ప్రయాణం, ప్రస్తుత ఆరోగ్య, అంతర్గత పరిస్థితులరీత్యా ఎలాంటి మలుపు తిరుగుతుందనేది తిరుపతి రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.