దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పరీక్షల వివాదం ఎట్టకేలకు ఒక కీలక మలుపు తిరిగింది. విద్యా వ్యవస్థను కుదిపేసిన ఈ సంక్షోభానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి స్వస్తి పలికారు. ప్రధాని మోదీ(PM Modi)కి ఆయన తన రాజీనామా లేఖను పంపడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
గత కొద్ది రోజులుగా విద్యార్థి సంఘాలు దేశ రాజధానిలో చేపట్టిన పోరాటం ఉప్పెనలా మారింది. నీట్(NEET) ప్రశ్నపత్రాల లీకేజీలు, అవకతవకలపై నిరసనలు మిన్నంటడంతో కేంద్రంపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఈ ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలు, ప్రాంతీయ పార్టీలు కూడా రోడ్డెక్కి సంఘీభావం తెలపడంతో పరిస్థితి సర్కార్ చేతిదాటిపోయింది. ఎగసిపడుతున్న ప్రజా ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కేంద్రం ఎట్టకేలకు మంత్రి చేత రాజీనామా చేయించి ఈ రగడకు తాత్కాలికంగా తెరదించింది.
ఈ పరిణామంతో విద్యార్థులు తమ ఆందోళనలను విరమించే అవకాశం ఉంది. అటు కాంగ్రెస్(Congress) సహా విపక్షాలు మాత్రం తాము కేంద్రం మెడలు వంచి విజయం సాధించామని సంబరాలు చేసుకుంటున్నాయి. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ అంశాలపై సాధించిన పైచేయి తర్వాత, విపక్ష శిబిరానికి దక్కిన మరో పెద్ద రాజకీయ మైలురాయిగా దీనిని అభివర్ణిస్తున్నాయి.
కానీ ఇక్కడే అసలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం ఒక మంత్రి తప్పుకోవడం వల్ల నీట్ వ్యవస్థలో ఉన్న లొసుగులన్నీ మాయమైపోయినట్లేనా? లక్షలాది మంది విద్యార్థుల(Students) భవిష్యత్తుతో ఆడుకుంటున్న పేపర్ లీకేజీల మహమ్మారికి శాశ్వత అడ్డుకట్ట పడినట్లేనా? మంత్రి రాజీనామాతో ఈ సమస్య ముగిసిందని భావించాలా లేక ఇది కేవలం ఆరంభం మాత్రమేనా? ఈ తాజా విజయంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఏకతాటిపై నిలిచి ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది? ఈ రాజకీయ పరిణామాల అసలు ముగింపు ఎటు దారితీస్తుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.