ఒక కథ ఒక హీరో చేతి నుంచి ఇంకో హీరో చేతికి వెళ్లడం ఇండస్ట్రీలో మామూలే. ఐతే తాము చేయొద్దనుకున్న సినిమా గురించి హీరోలు ఓపెన్గా మాట్లాడ్డానికి పెద్దగా ఇష్టపడరు. ఒకవేళ మాట్లాడినా.. వదులుకున్న సినిమా పేరు, దాని హీరో ప్రస్తావన తీసుకురారు. కానీ యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం మాత్రం తాను వదులుకున్న ఓ సినిమా గురించి చాలా ఓపెన్గా మాట్లాడేశాడు. ఆ చిత్రమే.. సంబరాల యేటిగట్టు.
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ముందు కిరణే చేయాల్సిందట. దర్శకుడు రోహిత్ కేపీ ఆ కథ ఫస్ట్ నరేషన్ ఇచ్చింది కిరణ్కేనట. ఆ కథ కూడా అతడికి బాగా నచ్చిందట. కానీ తన రేంజికి మించి చాలా ఎక్కువ బడ్జెట్ అయ్యేలా ఉండడంతో కిరణ్ ఆ సినిమాను వదులుకున్నాడట. తనతో సినిమా తీయడానికి నిర్మాత నిరంజన్ రెడ్డి రెడీగా ఉన్నా సరే.. అది మరీ రిస్క్ అన్న ఉద్దేశంతో తాను ఆ చిత్రం నుంచి తప్పుకున్నట్లు కిరణ్ వెల్లడించాడు.
రోహిత్ తనను 2021లోనే కలిసినట్లు కిరణ్ వెల్లడించాడు. అప్పుడు తన నుంచి ఎస్ఆర్ కళ్యాణ మండపం రిలీజైందని.. ఆ తర్వాత రోహిత్ తనకు రూ.2 కోట్ల బడ్జెట్లో పూర్తయ్యే చిన్న కథ ఒకటి చెప్పాడని అతను చెప్పాడు. అది మంచి కథ అని, అది విన్నపుడే రోహిత్ టాలెంట్ ఏంటో అర్థమైందని.. కానీ ఇంకా కొంచెం పెద్ద కథ, స్పాన్ ఉన్నది చేద్దాం, కొంచెం భారీతనం ఉన్న కథ తయారు చేసుకుని రా అని రోహిత్కు తాను చెప్పినట్లు కిరణ్ తెలిపాడు.
ఆ ప్రకారమే అతను సంబరాల యేటిగట్టు కథ రెడీ చేసుకుని వచ్చాడని.. కానీ దర్శకుడి విజన్కు తగ్గట్లు సినిమా తీయాలంటే 60-70 కోట్లు అవుతుందని అనిపించిందని.. అప్పటికి తాను కొన్ని ఫ్లాపులు ఎదుర్కోవడంతో తన మీద అంత బడ్జెట్ పెట్టడం చాలా రిస్క్ అనిపించిందని కిరణ్ చెప్పాడు. అయినా సరే నిర్మాత నిరంజన్ రెడ్డి తనతో ఆ బడ్జెట్లో సినిమా తీయడానికి రెడీ అయ్యారని.. కానీ వద్దు అని చెప్పి ఆ సినిమా నుంచి బయటికి వచ్చానని.. తర్వాత సాయిధరమ్ తేజ్తో రోహిత్, నిరంజన్ ఆ సినిమా చేయాలని నిర్ణయించుకోవడంతో చాలా సంతోషించానని కిరణ్ వెల్లడించాడు.
సంబరాల యేటిగట్టు కథ చాలా బాగుంటుందని.. ఆ సినిమా పెద్ద హిట్టవుతుందని కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐతే కిరణ్ చెప్పినట్లు మొదట్లో సంబరాల యేటిగట్టు బడ్జెట్ రూ.60-70 కోట్లు అనుకుని ఉండొచ్చు కానీ.. ఇప్పుడు దాని బడ్జెట్ వంద కోట్లు దాటిపోయిందని వార్తలు వస్తున్నాయి. బడ్జెట్ సమస్యల వల్లే సినిమా కొంత కాలం ఆగింది కూడా. ఇప్పుడు చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమాకు బడ్జెట్కు తగ్గట్లు బిజినెస్ చేయడం సవాలుగా మారినట్లు సమాచారం.