తమిళనాడు రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించాలని భావించిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్కు ఊహించని పరిణామం ఎదురైంది. అశేష జనవాహిని మద్దతుతో, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమైన దళపతికి రాజ్భవన్ రూపంలో గట్టి బ్రేక్ పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరేందుకు వెళ్లిన విజయ్ బృందానికి, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లెకర్ షాకింగ్ నిర్ణయాన్ని వినిపించారు. దీంతో ఒక్కసారిగా తమిళ రాజకీయాలు వేడెక్కాయి.
మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న ధీమాతో ఉన్న విజయ్(Vijay)కు, సాంకేతిక అంశాలే శాపంగా మారాయి. ప్రస్తుతం TVK క్యాంప్లో 112 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే, అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 118 అని గవర్నర్ స్పష్టం చేశారు. కేవలం ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు తక్కువగా ఉండటంతో, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేదని గవర్నర్ తెగేసి చెప్పారు. సంఖ్యాబలంపై గవర్నర్ను కన్విన్స్ చేసేందుకు విజయ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో TVK వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. గెలుపు ముంగిట బోల్తా పడినట్లుగా, అధికారం చేతికి అందే సమయంలో ఈ సంఖ్యాబలం అడ్డంకిగా మారడాన్ని అభిమానులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. గవర్నర్ షాక్ ఇచ్చిన నేపథ్యంలో, దళపతి విజయ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతును ఎలా కూడగడతారు? ఇతర పార్టీల సహకారం తీసుకుంటారా? లేక మరేదైనా వ్యూహంతో గవర్నర్ ముందుకు వెళ్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు, మరోవైపు పెరుగుతున్న రాజకీయ ఒత్తిడి.. ఈ రెండింటి మధ్య విజయ్ మాస్టర్ ప్లాన్ ఎలా ఉండబోతుందో చూడాలి. తమిళనాడు(Tamil Nadu) కోటపై దళపతి జెండా పాతాలంటే, ఇప్పుడు ఆ మేజిక్ ఫిగర్ చిక్కుముడి వీడటం అత్యవసరం.