టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహ వేడుకలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ వేడుకల్లో ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదే విజయ్ తల్లి మాధవి దేవరకొండ తన కాబోయే కోడలికి ఇచ్చిన అపురూపమైన కానుక.
సాధారణంగా పెళ్లిళ్లలో కానుకలు ఇవ్వడం సహజమే కానీ, విజయ్ తల్లి రష్మికకు ఇచ్చిన గిఫ్ట్ వెనుక ఒక ఎమోషనల్ బాండింగ్ కనిపిస్తోంది. సంగీత్ వేడుక సందర్భంగా మాధవి దేవరకొండ తమ కుటుంబ సంప్రదాయానికి చిహ్నమైన వారసత్వ బంగారు గాజులను రష్మికకు బహుకరించారట. తరతరాలుగా తమ కుటుంబంలో వస్తున్న ఈ నగలను ఇవ్వడం ద్వారా, రష్మికను కేవలం కోడలిగా మాత్రమే కాకుండా, తమ కుటుంబ వారసురాలిగా మనస్ఫూర్తిగా ఆహ్వానించినట్లు స్పష్టమవుతోంది. ఈ అపురూప కానుకను అందుకున్న రష్మిక ఎంతో భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది.
ఈ వేడుకకు సంబంధించిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సంగీత్ వేదికపై విజయ్-రష్మికల కెమిస్ట్రీ ఒకెత్తయితే, అత్తాకోడళ్ల మధ్య ఉన్న అనుబంధం మరో ఎత్తు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వేడుకలో విజయ్ తల్లి రష్మికకు స్వయంగా గాజులు తొడిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ `విరోష్`(ViRosh) వెడ్డింగ్కు అతిథుల తాకిడి పెరుగుతోంది. టాలీవుడ్ నుంచి దర్శకుడు తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా, నటి ఈషా రెబ్బా, రాహుల్ రవింద్రన్, ఆషికా రంగనాథ్ వంటి సన్నిహితులు ఇప్పటికే ఉదయ్పూర్ లో ల్యాండ్ అయిపోయారు.