లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట

admin
Published by Admin — June 12, 2025 in Andhra
News Image
కొన్ని నెలల కిందట తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డు తయారీ కోసం సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యత లోపించిందని.. అందులో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించడం.. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇదే తరహాలో తీవ్ర ఆరోపణలు చేయడంతో కలకలం రేగింది. ఈ వ్యవహారం తర్వాత కోర్టుకు వెళ్లింది. ప్రత్యేక విచారణ బృందం (సిట్) కొన్ని నెలలుగా ఈ కేసును విచారిస్తోంది. 
 
ఐతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలు చేశారని.. దీని వల్ల భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయని.. లడ్డూలో కల్తీ జరిగిందని నిరూపించలేకపోయారని వైసీపీ మద్దతుదారులు పెద్ద గొడవే చేశారు. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. ఐతే నెయ్యి కల్తీ వ్యవహారం గురించి సిట్ బృందం విచారణలతో విస్తుబోయే వాస్తవాలు బయటపడినట్లుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
 
వైసీపీ హయాంలో తిరుమల లడ్డు కోసం నెయ్యి సరఫరా చేసిన భోలే బాబా దారుణమైన మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పామ్ ఆయిల్‌‌‌తో పాటు కొన్ని రసాయనాలు కలిపిన నెయ్యిని ఏఆర్ డెయిరీ తరఫున అతను తిరుమలకు సరఫరా చేసినట్లు సిట్ విచారణలో వెల్లడైందట. అప్పుడు తిరుమలకు వచ్చింది నెయ్యే కాదని.. నెయ్యిలా కనిపించే పామ్ ఆయిల్ మిశ్రమం మాత్రమే అని సిట్ అధికారులు కోర్టుకు తెలిపారట. 
 
ఈ కుంభకోణంలో భాగమైన నిందితులు ఎవరికీ బెయిల్ ఇవ్వొద్దని పేర్కొంటూ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో సిట్ సంచలన విషయాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిట్ అధికారులు.. వైసీసీ ముఖ్య నేతల్లో ఒకరైన వైవీ సుబ్బారెడ్డి, ఆయన పీఏను విచారిస్తున్నారు. మరోవైపు ఈ నెయ్యి కల్తీ వ్యవహారంలో సాక్షులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
సాక్షులు సిట్ ముందు హాజరు కాకుండా అడ్డుకోవడం.. కిడ్నాప్‌లు చేయడం లాంటివి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో బయటికి రానున్న సిట్ విచారణ నివేదికలో మరిన్ని సంచలన విషయాలు వెల్లడి కాబోతున్నాయని.. ఈ వ్యవహారంలో వైసీపీకి చెందిన ముఖ్య నేతలు కొందరు బాగా ఇరుక్కోనున్నారని సమాచారం.
Tags
tirupati laddu ghee issue adulterated ghee sanctity of laddu
Recent Comments
Leave a Comment

Related News