పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడడం అనివార్యంగా కనిపిస్తోంది. చిత్ర బృందం దీనికి సిద్ధపడిపోయినట్లే కనిపిస్తోంది. దీని వల్ల వాటిల్లే నష్టం కూడా ఎక్కువే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం తనకు రావాల్సిన తన పారితోషకాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డట్లు సమాచారం. మొత్తం పారితోషకం ఎంత అన్నది క్లారిటీ లేదు కానీ.. ఇప్పటిదాకా అడ్వాన్స్ రూపంలో తీసుకున్న 11 కోట్ల రూపాయలను పవన్ వెనక్కి ఇచ్చేస్తున్నాడట.
ఇదేమీ రహస్యంగా జరిగిన విషయం కూడా కాదు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. ‘హరిహర వీరమల్లు’ సినిమాను పవన్ గత నెలలోనే పూర్తి చేశారు. సినిమా పూర్తయితే పారితోషకం మొత్తం పవన్కు అంది ఉంటుందని అనుకుంటాం. కానీ ఇప్పటిదాకా ఆయన రూ.11 కోట్లు మాత్రమే తీసుకున్నారు. అది కూడా ఇప్పుడు వెనక్కి ఇచ్చేస్తున్నారు. పవన్ ప్రస్తుతం సినిమాకు రూ.50 కోట్ల మేర తీసుకుంటున్నట్లు అంచనా.
‘హరిహర వీరమల్లు’ మొదలై ఐదేళ్లు దాటిపోయింది. భారీ బడ్జెట్, చిత్రీకరణతో ముడిపడ్డ సినిమా కావడం.. పవన్ ఇతర సినిమా, పొలిటికల్ కమిట్మెంట్ల వల్ల సఈ చిత్రం బాగా ఆలస్యం కావడంతో బడ్జెట్ తడిసి మోపెడైంది. సినిమా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం పవనే. అయినా నిర్మాత ఓపిగ్గా ఎదురు చూశారు. సినిమాను పూర్తి చేశారు. కానీ ఈ లోపు బడ్జెట్ హద్దులు దాటిపోయింది. తీరా చూస్తే బిజినెస్ అందుకు తగ్గట్లు జరగట్లేదు. ఆలస్యం వల్ల సినిమాకు హైప్ తగ్గడం ప్రతికూలంగా మారింది.
ఇప్పుడు సినిమాను వాయిదా వేయక తప్పని పరిస్థితుల్లో నిర్మాత దిక్కు తోచని స్థితికి చేరుకున్నాడు. దీని వల్ల ఓటీటీ డీల్లో కూడా కోత పడబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ మొత్తం పారితోషకాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అడ్వాన్స్ను వెనక్కి ఇచ్చేస్తున్నారు. పవన్ నిర్ణయం పట్ల ఇండస్ట్రీలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.