రాజకీయాల్లో ఓటమి నేర్పే పాఠాలు చాలా గొప్పవి అంటారు. కానీ, ఆ పాఠాలను వంటబట్టించుకోవడం అందరికీ సాధ్యం కాదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) మరోసారి నిరూపిస్తున్నారు. 2024 ఎన్నికల ముందు "వై నాట్ 175" అంటూ చేసిన అతి విశ్వాసపు వ్యాఖ్యలు పార్టీని ఎంతటి ఘోర స్థితికి నెట్టాయో ప్రత్యక్షంగా చూశాం. సరిగ్గా ఇప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ... సేమ్ సీన్, సేమ్ డైలాగ్ మళ్లీ రిపీట్ అవుతోంది.
స్థానిక పోరులో ఎన్నికలు సాఫీగా జరిగితే చాలు, వైసీపీ(YCP) కళ్లు మూసుకొని గెలిచేస్తుందని జగన్ తాజాగా తేల్చి చెప్పారు. పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పడం నాయకుడి బాధ్యత అనడంలో సందేహం లేదు. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులను పూర్తిగా పక్కనపెట్టి మాట్లాడటమే ఇక్కడ అసలు సమస్య. ప్రస్తుతం గ్రౌండ్ రియాలిటీ చూస్తే, కూటమి ప్రభుత్వం పూర్తి జోరుమీద ఉంది. వైసీపీ నాయకులు, కేడర్ ఇంకా ఓటమి షాక్ నుంచి బయటపడక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో "కళ్లు మూసుకుంటే విజయం" అనడం చూసి, నెటిజన్లు మాత్రం... "సార్! కళ్లు తెరిచి చూస్తే గానీ అసలు నిజం ఏంటో తెలియదు!" అంటూ సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.
మరోవైపు, చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం పోలీసులను, అధికారులను అడ్డుపెట్టుకుని తమను ఓడించేందుకు ప్లాన్ చేస్తోందని, దానికి వ్యతిరేకంగా పోరాడాలని జగన్ పిలుపునిచ్చారు. అంటే, రేపు ఫలితాలు తేడా కొడితే, నెపాన్ని వెంటనే అధికారుల మీదికి తోసేయడానికి ముందే ఓ 'సేఫ్ గేమ్' ప్లాన్ చేసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు వాడే పాత ఫార్ములానే ఇదీ.
మారని స్టైల్.. మారేనా ఫలితం?
నాయకుడి మాటలు విశ్వాసాన్ని నింపాలి తప్ప, ఎదుటివారికి నవ్వులాటగా మారకూడదు. "వై నాట్ 175(Why Not 175)" కామెంట్లు ఏ రేంజ్లో ట్రోలింగ్కు గురయ్యాయో అందరికీ తెలుసు. ఇప్పుడు స్థానిక పోరులో మళ్లీ అదే తరహాలో "వై నాట్ పార్ట్-2" సినిమా చూపించేందుకు జగన్ సిద్ధపడటం విచిత్రంగా ఉంది. కాన్ఫిడెన్స్ విషయంలో జగన్ నెక్స్ట్ లెవెల' అని నెటిజన్లు సరదాగా అంటున్నా... ప్రాక్టికల్ పాలిటిక్స్ మాట్లాడకపోతే, వచ్చే ఫలితాలు మళ్లీ పాత షాక్నే గుర్తుచేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.