తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన కొండా కుటుంబం వివాదంపై సీనియర్ నేత కొండా మురళి స్పందించారు. సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy)పై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, భట్టితో భేటీపై వస్తున్న ఊహాగానులకు కొండా మురళి తనదైన శైలిలో ఫుల్స్టాప్ పెట్టారు.
అసలు భట్టిని ఎందుకు కలిశారంటే?
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)ను తాను కేవలం ఒక కీలక బిల్లు గురించిన చర్చల కోసమే కలిశానని కొండా మురళి స్పష్టం చేశారు. అంతే తప్ప, తన కుమార్తె సుస్మిత వివాదం గురించి లేదా ఆమె చేసిన వ్యాఖ్యల గురించి తాము ఇద్దరం మాట్లాడుకోలేదని స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ అందుబాటులో లేరంటూ జరుగుతున్న ప్రచారంలోనూ ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు.
తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కొండా మురళి(Konda Murali) కుండబద్దలు కొట్టారు. "మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేం సంబంధం? తన అభిప్రాయాలు చెప్పే స్వతంత్ర హక్కు ఆమెకు ఉంది. సుస్మితను ప్రశ్నించే హక్కు మాకు లేదు" అని తేల్చిచెప్పారు. ఆమె ఎవరి ఇష్టప్రకారం వారు ఉంటారని, కూతురి మాటలకు తల్లిదండ్రులుగా తాము బాధ్యత వహించాల్సిన అవసరం లేదని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా మురళి పూర్తిగా ఖండించారు. తాము వందశాతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని, గాంధీ కుటుంబంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని పునరుద్ఘాటించారు. రాజకీయాల్లో ఎవరి నిర్ణయాలు వారికుంటాయని, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ లేదా కవిత లాంటి నేతల పరిణామాలను ఉదాహరణగా చూపుతూ పరోక్ష కామెంట్స్ చేశారు.
కాగా, పరకాల అసెంబ్లీ టికెట్ కేటాయింపుల వివాదం చుట్టూ తిరుగుతున్న ఈ పరిణామాలు కాంగ్రెస్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పీసీసీ(PCC) క్రమశిక్షణ కమిటీ నివేదికపై అధిష్ఠానం తీసుకోబోయే తుది నిర్ణయం కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.