ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా వెలుగొందుతున్న బొత్స కుటుంబం(Botsa Family) గురించిన చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇన్నాళ్లూ వైఎస్సార్సీపీకి బలమైన కోటగా ఉన్న విజయనగరం జిల్లాలో, ఆ పార్టీ అధిపత్యాన్ని శాసించిన కీలక నాయకుడే సొంత గూడును వీడేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
తాజాగా తన కుమార్తె డాక్టర్ అనూష రాజకీయ ప్రవేశంపై బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) చేసిన ప్రకటన ఈ ఊహాగాగాలకు మరింత బలాన్ని చేకూర్చింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయనగరం జిల్లా పరిషత్ పీఠమే లక్ష్యంగా ఆమెను బరిలోకి దింపుతున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఈ ప్రకటన వెలువడిన సమయంలో వైఎస్సార్సీపీ పేరును లేదా పార్టీ ప్రస్తావనను ఎక్కడా తీసుకురాకపోవడం గమనార్హం. సరిగ్గా ఈ పాయింటే ఇప్పుడు సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపింది.
బొత్స కుటుంబం జనసేన పార్టీ అగ్రనేతలతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. తమ కుమార్తెకు జెడ్పీ చైర్మన్ పీఠం కేటాయించడంపై స్పష్టమైన హామీ వస్తే, అధికార కూటమిలోకి వెళ్లేందుకు వారు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే వైఎస్సార్సీపీ(YSRCP) శ్రేణులకు ఊహించని షాక్ అవుతుందనే అనే చెప్పాలి. ఉత్తరాంధ్రలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఇలా సంచలన నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారుతుంది.
మరోవైపు, బొత్స కుటుంబం జనసేన వైపు అడుగులు వేయడం అంత సులువైన విషయం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య స్థానిక స్థాయిలో ఉన్న పాత విభేదాలు, సమీకరణాలను అధిగమించాల్సి ఉంటుంది. కూటమిలోని అన్ని పక్షాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఈ పొలిటికల్ ఎంట్రీ స్క్రిప్ట్ విజయవంతం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ, ఈ పరిణామాలు గనుక నిజమైతే విజయనగరం జిల్లాతో పాటు ఉమ్మడి ఉత్తరాంధ్ర రాజకీయ రూపురేఖలు పూర్తిగా మారిపోవడం ఖాయం. మరి ఈ పరిణామాలు కూటమిలో ఎలాంటి కొత్త చర్చలకు దారితీస్తాయి? బొత్స ఎంట్రీపై స్థానిక టీడీపీ(TDP) కేడర్ ఎలా స్పందిస్తుంది? అన్నది చూడాలి.