ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో మరో కొత్త పార్టీ అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijay Sai Reddy) త్వరలోనే ఒక సరికొత్త రాజకీయ వేదికను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. శ్రావణమాసం పూర్తయిన తర్వాత మూడు నుంచి నాలుగు నెలల్లో కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక కసరత్తును కూడా ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.
అయితే గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగామాలకు సైతం ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి తెరదించారు. ముఖ్యంగా తాను బీజేపీలో చేరబోతున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. బీజేపీ(BJP)లో చేరే ఆలోచనే తనకు లేదని స్పష్టం చేయడంతో, ఆయన స్వతంత్రంగా రాజకీయ ప్రయాణం సాగించనున్నారనే స్పష్టత వచ్చింది. ప్రస్తుతం కొత్త పార్టీకి సంబంధించిన ఏర్పాట్లను ఆయన విజయవాడ కేంద్రంగా కొనసాగిస్తున్నారు.
త్వరలోనే విజయవాడ(Vijayawada)లో ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో కొత్త పార్టీ పేరు, విధివిధానాలు, పార్టీ అనుసరించే లక్ష్యాలు అలాగే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు. విజయవాడ సభ అనంతరం తిరుపతి, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ రాజకీయ పార్టీలకు పూర్తిగా భిన్నమైన శైలిలో తమ కొత్త పార్టీ పనిచేస్తుందని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అవినీతి నిర్మూలన, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా తమ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పారు. ప్రాంతాల వారీగా ప్రజలతో నేరుగా సమావేశమై వారి అభిప్రాయాలు, ఆకాంక్షలను సేకరించి, వాటికి అనుగుణంగానే పార్టీ విధానాలను రూపాంతరం చెందిస్తామని తెలిపారు. ప్రజల గొంతుకగా నిలుస్తూ వారి సమస్యలపై నిరంతరం పోరాడేలా బలమైన రాజకీయ వేదికను నిర్మించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ తాజా పరిణామం ఏపీ(AP) రాజకీయాల్లో ఎలాంటి సమీకరణాలకు దారితీస్తుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.