ఏపీ(AP) రాజకీయాల్లో మరోసారి అసెంబ్లీ సమావేశాల హీట్ రాజుకుంది. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నాలుగు రోజుల వర్షాకాల సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో అధికార, ప్రతిపక్ష శిబిరాల్లో కదలిక వచ్చింది. అయితే, ఈ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ వ్యవహరించ తీరుపైనే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది.
ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) పార్టీ, ఈసారీ అదే వైఖరిని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని ఆ పార్టీ గట్టి పట్టుపట్టింది. అసెంబ్లీలో ఒకే ఒక ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆ హోదా తమకే దక్కాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. అయితే, మొత్తం సీట్లలో కనీసం 10 శాతం వస్తేనే ఆ హోదా ఇస్తామంటూ అధికార కూటమి స్పష్టం చేయడంతో ఇక్కడ ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపథ్యంలో 164 సీట్లతో సంపూర్ణ బలంతో ఉన్న కూటమి సర్కార్ ముందు తమ డిమాండ్ నెరవేరదని భావించిన వైసీపీ.. ఎప్పటిలాగే అసెంబ్లీకి దూరంగా ఉండటమే మేలని డిసైడ్ అయినట్లు సమాచారం.
అయితే అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్న జగన్ అండ్ కో, ఈసారి శాసనమండలిని వేదికగా మలచుకోవాలని మాస్టర్ ప్లాన్ వేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మండలిలో వైసీపీకి ముప్పైకి పైగా బలమైన సంఖ్యాబలం ఉంది. అంతేకాదు, అక్కడ అధికారికంగా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కడంతో పాటు సీనియర్ నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ఆ బాధ్యతల్లో ఉన్నారు. దీంతో అసెంబ్లీలో తమ గొంతు వినిపించకపోయినా, మండలిలో మాత్రం కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని వైసీపీ అధినాయకత్వం పావులు కదుపుతోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగులను కుదిపేస్తున్న మెగా డీఎస్సీ అంశాన్నే ప్రధాన ఆయుధంగా మలచుకోవాలని వైసీపీ(YCP) భావిస్తోంది. ఇప్పటికే బయట ఆందోళనలు చేస్తున్న ఆ పార్టీ, మండలి సమావేశాల్లో ఇదే అంశంపై ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉంది. బొత్సతో పాటు ధాటిగా మాట్లాడే పలువురు ఎమ్మెల్సీలను రంగంలోకి దించి అధికార పక్షాన్ని కార్నర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి చూస్తే.. అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడకుండా, కేవలం మండలి వేదికగానే తమ రాజకీయ పోరాటాన్ని కొనసాగించాలని జగన్ తన వ్యూహాన్ని మార్చినట్లు స్పష్టమవుతోంది. మరి నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో కౌన్సిల్ రణరంగం ఎంతవరకు మారుతుందో వేచి చూడాలి.