ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైసీపీ మాజీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) పేరు హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలకు, పార్టీకి దూరంగా ఉన్న ఆయన.. మళ్లీ సొంత గూటికి చేరబోతున్నారంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామం వెనుక అసలు ఏం జరుగుతోంది? తెరవెనుక నడుస్తున్న వ్యూహాలు ఏంటి?
సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేసి తప్పుకున్నారు. ఆ తర్వాత అధినేత వైఎస్ జగన్(YS Jagan)తో పాటు పార్టీ తీరుపై కొన్ని సందర్భాల్లో పరోక్ష అసంతృప్తి కూడా వెళ్లగక్కారు. అయితే, ఆయన నిష్క్రమణ తర్వాత వైసీపీకి జాతీయ స్థాయిలో గ్యాప్ ఏర్పడిందనే చర్చ బలంగా నడుస్తోంది. ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పడంలో, జాతీయ పార్టీలతో సమన్వయం చేసుకోవడంలో విజయసాయిరెడ్డి చూపిన చొరవ పార్టీకి చాలా కీలకంగా ఉండేది. ప్రస్తుతం ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోందని, కేంద్రంతో వ్యవహారాలు నడపడంలో ప్రస్తుత లీడర్షిప్ ఇబ్బంది పడుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రచారంపై అటు విజయసాయిరెడ్డి కానీ, ఇటు వైసీపీ(YCP) అధిష్టానం కానీ అధికారికంగా స్పందించలేదు. ఖండించకపోవడం వల్లే ఈ ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. మరోవైపు, సోషల్ మీడియా వేదికగా పార్టీకి ఉపయోగపడేలా, కొన్నిసార్లు దిశానిర్దేశం చేసేలా ఆయన చేస్తున్న పోస్టులను వైసీపీ కేడర్ పాజిటివ్గానే తీసుకుంటోంది. ఇరువర్గాల మధ్య దూరం తగ్గించేందుకు కొందరు ప్రముఖులు తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉన్న నైపుణ్యం, అనుభవం ఉన్న నేత మళ్లీ ఉంటే బాగుంటుందనే భావన అధిష్టానం నుంచి కూడా వస్తున్నట్లు సమాచారం.
ఇక రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశానని ప్రకటించిన విజయసాయిరెడ్డి.. మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తారా? ఒకవేళ వస్తే మళ్లీ వైసీపీ కండువా కప్పుకుంటారా? అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ రీఎంట్రీ గనుక నిజమైతే, అది ఏపీ(AP) రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం అవుతుంది. ప్రస్తుతానికి ఇదొక పొలిటికల్ రూమర్లా కనిపిస్తున్నా, రాబోయే రోజుల్లో ఇది నిజరూపం దాల్చే అవకాశాలున్నాయనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ సస్పెన్స్కు తెరపడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.