రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కోట్లు విలువ చేసే భూ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో మాజీ స్పీకర్, వైసీపీ(YCP) సీనియర్ నేత తమ్మినేని సీతారాం కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊహించని తీర్పు ఎదురైంది. భూ యజమాని ప్రాణాలతో ఉండగానే ఆయన మరణించినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, రూ.4 కోట్ల విలువైన భూమిని కొట్టేసినట్లు వస్తున్న ఆరోపణల కేసులో న్యాయస్థానం ఇటు తండ్రికి ఊరటనిస్తూనే, అటు కొడుకు అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించింది.
ఈ వివాదంలో ప్రధానంగా తమ్మినేని సీతారాం కుమారుడు, ఐదో నిందితుడైన వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్ (Venkata Sriramulu Chiranjeevi Nag ) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. నాగ్ తరఫున వాదనలు విన్న జస్టిస్ వై. లక్ష్మణరావు, ఆయనపై మోపబడిన అభియోగాల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్నారు. తాను కొనుగోలు చేసినట్లు చెబుతున్న మూడు ప్లాట్లకు సంబంధించి ఎలాంటి అధికారిక నగదు చెల్లింపుల ఆధారాలను చూపించడంలో ఆయన విఫలమవ్వడం బెయిల్ నిరాకరణకు ప్రధాన కారణంగా నిలిచింది. దీంతో ఆయన అరెస్ట్ కత్తి మరింత వేడెక్కింది.
అయితే, ఇదే కేసులో ఆరో, ఏడో నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం(Tammineni Seetharam), ఆయన భార్య వాణిశ్రీలకు హైకోర్టు ఊరటనిచ్చింది. వీరిద్దరిపై ఎలాంటి నిర్దిష్టమైన, బలమైన ఆరోపణలు లేకపోవడాన్ని న్యాయస్థానం గుర్తించింది. అంతేకాకుండా, గతంలో ఈ భూ వివాదంపై దాఖలైన సివిల్ దావాలో వీరిద్దరి పేర్లు ప్రతివాదులుగా లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. వారికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇక ఈ కేసుకు సంబంధించి తమ్మినేని సీతారాంను ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు దర్యాప్తు అధికారి ఎదుట విధిగా హాజరుకావాలని హైకోర్టు(High Court) ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ దర్యాప్తునకు సహకరించని పక్షంలో ఈ మధ్యంతర బెయిల్ రద్దు అవుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన బెయిల్ పిటిషన్లపై తదుపరి విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది. ఒకే కుటుంబంలో తండ్రికి ఊరట, కొడుకుకు ఎదురుదెబ్బ తగలడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.