ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్న వేళ ఒక ఊహించని పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో ఓట్ల వెరిఫికేషన్ పూర్తి చేస్తున్న తరుణంలో.. సాక్షాత్తూ ఒక తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఓటే లిస్ట్లో లేకుండా పోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఈ షాకింగ్ ఉదంతం గుంటూరు నగరంలో వెలుగుచూసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కీలక శాఖను నిర్వహించిన సీనియర్ నేత, డాక్టర్ సనక్కాయల అరుణకుమారి(Sanakkayala Aruna Kumari)కి ఎన్నికల అధికారులు గట్టి షాకే ఇచ్చారు. ఓటర్ల జాబితా సవరణ పనులు జరుగుతుండటంతో, తన ఓటు భద్రంగా ఉందో లేదోనని ఆమె ఆన్లైన్లో చెక్ చేసుకున్నారు. అయితే, అందులో తన పేరు కనిపించకపోవడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. అధికారులను సంప్రదించగా.. సాంకేతిక కారణాలో, లేక పొరపాటో కానీ ప్రస్తుతానికి లిస్ట్లో ఆమె ఓటు లేదనే చేదు నిజం తెలిసింది.
తన ఓటు హక్కు గల్లంతు కావడంపై మాజీ మంత్రి అరుణకుమారి(Former Minister Aruna Kumari) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గుంటూరు కలెక్టరేట్కు పరుగులు తీశారు. అక్కడ జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎన్నికల అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు. దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉంటూ, మంత్రిగా చేసిన తన ఓటునే బాధ్యతారాహిత్యంగా ఎలా తొలగిస్తారని అధికారులను నిలదీశారు. తక్షణమే స్పందించి తన ఓటును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లు, వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలను తొలగించేందుకు జూలై 14 వరకు గడువు విధించిన అధికారులు.. ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఒక మాజీ మంత్రి ఓటుకే దిక్కు లేకపోతే.. ఇక సామాన్య పౌరుల పరిస్థితి ఏంటి? అని పెదవి విరుస్తున్నారు.
కాగా, డాక్టర్ సనక్కాయల అరుణకుమారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ మహిళా నేత. వృత్తిరీత్యా వైద్యురాలైన ఆమె, ప్రజాసేవపై ఉన్న ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఘన విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ, ఆమె ప్రతిభను గుర్తించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) తన రెండవ మంత్రివర్గంలో ఆమెకు మెడికల్, హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్స శాఖను అప్పగించారు. 1999 నుంచి 2004 వరకు దాదాపు రెండేళ్ల పాటు మంత్రిగా సమర్థవంతంగా సేవలు అందించిన అరుణ.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.