కొన్నేళ్ల ముందు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఆయన మాజీ శిష్యురాలే అయిన లేడీ కొరియోగ్రాఫర్ లైంగిక దాడి కేసు పెట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జానీ కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నాడు. తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చాడు. ఇంకా ఆ కేసు నడుస్తూనే ఉన్నట్లుంది. ఈ కేసు విషయంలో ఎవరి వెర్షన్ వాళ్లది. ఇండస్ట్రీలో కూడా దీని మీద భిన్నాభిప్రాయాలున్నాయి.
ఐతే బెయిల్ మీద బయటికి వచ్చాక కొంత కాలం జానీకి అవకాశాలు రానట్లే కనిపించాయి. కానీ తర్వాత యథావిధిగా పని చేసుకుంటున్నాడు. తనపై కేసు పెట్టిన కొరియోగ్రాఫర్ తన సినిమాలు తాను చేసుకుంటోంది. ఐతే ఆ అమ్మాయి ఇప్పుడు నాగబంధం అనే సినిమాలో ఒక చిన్న పాత్ర చేయగా.. ఆ పాత్ర మీద సినిమాలో పెట్టిన సీన్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతోంది.
సదరు కొరియోగ్రాఫర్ నాగబంధం చిత్రంలో ఒక బ్రాహ్మణ మహిళగా కనిపించింది. సినిమాలో 18వ శతాబ్దం నేపథ్యంలో నడిచే ఓ ఎపిసోడ్లో హిందూ ఆలయం మీద ముస్లిం రాజులు దాడిచేస్తారు. ఈ క్రమంలో బ్రాహ్మణ మహిళలలను ముస్లిం సైనికులు చెరపట్టి.. రాజుల గదుల్లోకి పంపినట్లు చూపిస్తారు. జానీ మీద కేసు పెట్టిన అమ్మాయిని ముస్లిం రాజు తన గుడారంలోకి లాక్కెళ్లి బలవంతం చేయబోవడం.. ఈ క్రమంలో తన మీద ఒక వల్గర్ కామెంట్ చేయడం.. తర్వాత ఆమె నీ చేయి నా మీద పడగానే నేను చచ్చినట్లే అనడం.. తర్వాత తన ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది.
ఇక్కడ విలన్ ముస్లిం కావడం.. అతను ఆమె మీద అత్యాచారానికి ప్రయత్నించడం.. ఈ వ్యవహారమంతా చూస్తే నిజ జీవిత వ్యక్తులు.. ఈ కేసు వ్యవహారం గుర్తుకు రాకమానదు. ఆ కేసు బాధితురాలినే ఈ సీన్లో పెట్టడంతో పరోక్షంగా ఈ సినిమా ద్వారా జానీ మీద కౌంటర్ వేసే ప్రయత్నం వేశారా అనే సందేహాలు కలుగుతున్నాయి. దీనిపై రేప్పొద్దున చిత్ర బృందం మీడియాను కలిసినపుడు ప్రశ్నలు ఎదురైతే ఆశ్చర్యం లేదు.