భుజానికి సంబంధించిన సమస్యపై చికిత్స కోసం.. ముంబై వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంగళవారం ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భం గా ఆయనను ఘనంగా సత్కరించి కొండపల్లి బొమ్మలను కానుకగా అందించారు. ఈ సందర్భంగా.. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలు, రాజకీయ బంధాలపై చర్చించినట్టు తెలిసింది. కేంద్రంలో జనసేన పార్టీ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.
ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి రెండు ఆడ పులులు ఇచ్చే అంశాలపై చర్చించినట్టు జనసేన కార్యాలయం తెలిపింది. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు. ఏపీలోని తూర్పు కనుమల్లో ఆడపులుల సంఖ్య తగ్గిపోతున్న విషయంపై ఇటీవల కేంద్రానికి కూడా పవన్ లేఖరాసిన విషయం తెలిసిందే.
తాజాగా మహారాష్ట్ర పర్యటనలోనూ ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని పవన్ చెబుతున్నా రు. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నామన్నా రు. ఏపీకి 2 ఆడ పులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, వారు అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
శాస్త్రీయ విధానాలు, జీవ వైవిధ్య పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాయన్న అంశాన్ని ఈ సంయుక్త సంరక్షణ కార్యచరణ ప్రతిబింబిస్తోందని పవన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్–మహారాష్ట్రల మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం తూర్పు కనుమలలో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు విశేషంగా దోహదపడు తుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు.