తమిళనాడు(Tamil Nadu) ప్రజా రవాణా వ్యవస్థలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. సాధారణంగా ప్రభుత్వ బస్సులంటేనే కాస్త అసౌకర్యం, కిటకిటలాడే జనం గుర్తొస్తారు. కానీ, ఇకపై ఆ ముద్రను చెరిపేసేందుకు ముఖ్యమంత్రి విజయ్ సర్కార్ నడుం బిగించింది. రాష్ట్రంలో సరికొత్త ప్రయాణ అనుభూతిని అందించడమే లక్ష్యంగా రవాణా శాఖలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భవిష్యత్తులో ప్రభుత్వం కొనుగోలు చేయబోయే కొత్త బస్సులన్నీ ఎయిర్ కండిషన్డ్ (AC) సౌకర్యంతోనే ఉంటాయని ప్రకటించి సామాన్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ఇటీవలే ముఖ్యమంత్రి విజయ్(CM Vijay) స్వయంగా ప్రభుత్వ బస్సులో ప్రయాణించి, క్షేత్రస్థాయిలో ప్రయాణికుల ఇబ్బందులను పరిశీలించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనే ఈ సంచలన నిర్ణయానికి పునాది వేసింది. మారుమూల గ్రామాలకు సైతం మెరుగైన రవాణా సౌకర్యం అందించడంతో పాటు, సామాన్యుడు కూడా ఏసీ బస్సులో హాయిగా ప్రయాణించాలన్నదే సీఎం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్థిబన్ స్పష్టం చేశారు. అధునాతన హంగులతో, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కొత్త బస్సులను తీసుకురావాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
ప్రజా రవాణాను ఆధునీకరించే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ముఖ్యమంత్రి విజయ్ రూ. 127.21 కోట్ల వ్యయంతో సిద్ధం చేసిన 300 కొత్త బస్సులను ప్రారంభించారు. పర్యావరణ హితానికి ప్రాధాన్యత ఇస్తూ కొనుగోలు చేసిన ఈ వాహనాలలో 164 డీజిల్ బస్సులు, 136 బీఎస్-6 ప్రమాణాలు కలిగిన సీఎన్జీ (CNG) బస్సులు ఉన్నాయి. పర్యావరణాన్ని రక్షిస్తూనే, ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందించడమే తమ ప్రభుత్వ అంతిమ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో తమిళనాడు ఆర్టీసీ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.