అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సంచలనమే. ముఖ్యంగా వలసదారుల విషయంలో ఆయన అనుసరించే కఠిన వైఖరి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంటుంది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకురాబోతున్న ఒక కొత్త ప్రతిపాదన ఇప్పుడు అమెరికాలో స్థిరపడాలని చూస్తున్న విదేశీయులకు, ముఖ్యంగా అక్కడి భారతీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పౌరసత్వ దరఖాస్తు (సిటిజన్షిప్) ఫీజులను ఏకంగా 75 శాతానికి పైగా పెంచాలని వైట్హౌస్ యోచిస్తుండటమే ఈ ఆందోళనకు ప్రధాన కారణం.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అమెరికా పౌరసత్వం(US Citizenship) కోసం దరఖాస్తు చేసుకోవడానికి 760 డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది. అయితే ట్రంప్ తెస్తున్న కొత్త రూల్ ప్రకారం ఈ ఫీజును ఏకంగా 1330 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. కేవలం అప్లికేషన్ ఫీజే కాకుండా, ఒకవేళ దరఖాస్తు తిరస్కరణకు గురైతే దానిపై అప్పీలు చేసుకునే ఫీజును కూడా 830 డాలర్ల నుంచి 1475 డాలర్లకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ భారీ పెంపుతో సగటు వలసదారుడి ఆర్థిక బడ్జెట్ తలకిందులయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
అమెరికాలో గ్రీన్ కార్డ్(Green Card) పొంది, ఆ తర్వాత పౌరసత్వం కోసం ఎదురుచూసే వారిలో భారతీయుల సంఖ్యే అత్యధికం. సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి సాధారణ వ్యాపారాల వరకు ఎంతోమంది ఐదేళ్ల నిరీక్షణ తర్వాత సిటిజన్షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. అయితే తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తే, ఒకే కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నవారు పౌరసత్వం పొందాలంటే వేల డాలర్లు అదనంగా సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇది మధ్యతరగతి వలసదారులపై మోయలేని భారంగా మారనుంది.
ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ (Public Comments) దశలో ఉన్నప్పటికీ, దీనిపై అప్పుడే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తక్కువ ఆదాయం ఉన్న వలసదారులకు అమెరికా పౌరసత్వాన్ని దూరం చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు వ్యూహమనే విమర్శలు వస్తున్నాయి. కేవలం ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారికే అమెరికా స్వాగతం పలుకుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఈ ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గుతుందా, లేక ఈ భారాలనే ఖరారు చేస్తుందా అనేది చూడాలి.