పోక్సో కేసులో బండి భగీరథ్ మే 16న అరెస్టైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి భగీరథ్ చర్లపల్లి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా భగీరథ్ కు కోర్టు వారం రోజుల పాటు తాత్కాలిక(మధ్యంతర) బెయిల్ మంజూరు చేసింది. సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు వారం రోజుల పాటు భగీరథ్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 28న బెయిల్ గడువు ముగిసిన తర్వాత భగీరథ్ తిరిగి కోర్టుకు లొంగిపోవాలని ఆదేశించింది.
17 ఏళ్ల మైనర్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పేట్ బషీరాబాద్ పోలీసులు మే 8న పోక్సో (POCSO) చట్టంలోని పలు సెక్షన్ల కింద, బీఎన్ఎస్ (BNS) సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఆ ఆరోపణలు వచ్చిన తర్వాత భగీరథ్ కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నాడు. తెలంగాణ హైకోర్టు అంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ను తిరస్కరించిన తర్వాత భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ కేసు తెలంగాణ బీజేపీని (BJP)ని ఇరకాటంలో పడేసింది. అయితే, ఇప్పటికీ ఈ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ కాలేదని తెలుస్తోంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. మరోవైపు, పోక్సో కేసులో నిందితుడు అయిన భగీరథ్ కు మధ్యంతర, తాత్కాలిక బెయిల్ ఇవ్వడంపై రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.