సీఎం చంద్రబాబు నమ్మకమే.. కొందరు ఉన్నతాధికారులకు ఆయుధంగా మారుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు ఏదీ ఒక పట్టాన నమ్మరు. తన కంటితో చూడందే.. తన చెవితో వినందే.. ఏ విషయంపైనా ఒక నిర్ణయానికి రారు. అలాంటిది.. గత రెండేళ్లుగా కూడా.. ఆయన పెట్టుబడుల వేటలో పడి.. అధికారులు చెప్పింది.. వారి నోటి నుంచి విన్నదే.. వాస్తవమని నమ్ముతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోందని సీనియర్ నేతలు చెబుతున్నా రు.
నెల రోజుల కిందట..
ఖచ్చితంగా నెల రోజుల కిందట.. సీఎం చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్సు పెట్టారు. రెండు రోజుల ఈ సద స్సులో చివరి రోజు.. దాదాపు 6 గంటల పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలపై చర్చించారు. ఈ సమయంలో ఉన్నతాధికారులు జిల్లాల వారీగా నివేదికలు ఇచ్చారు. అంతా బాగుందని.. అద్భుతంగా ఉందని చంద్ర బాబుకు వివరించారు. దీంతో చంద్రబాబు వారిని నమ్మారు. అంతా బాగుందని అనుకున్నారు. కానీ.. తరచి చూస్తే.. ఆ మన్నాడే.. కర్నూలు, అనంతపురం స్టేషన్లో జరిగిన వ్యవహారాలపై హైకోర్టు నిలదీసింది.
ఏకంగా డీజీపీని ప్రశ్నించింది. హోం శాఖ వివరణ కోరింది. ఓ మహిళ ఫిర్యాదు చేసేందుకు వస్తే.. ఆమె పైనే సీఐ అఘాయిత్యానికి పాల్పడ్డారన్నది అనంతపురంలో నమోదైన కేసు. కర్నూలులో భూదందాలో జోక్యం చేసుకున్న మరో ఎస్సై సీఐలు.. భారీగాసొమ్ము చేసుకున్నారని.. బెదిరించారని మరో కేసు.. ఇలా.. ఆ మర్నాడే వెలుగు చూడడం గమనార్హం. ఆ తర్వాత.. ఇలాంటి కేసులు 5 జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. ఫలితంగా పోలీసు ఉన్నాతాధికారులు ఇచ్చిన నివేదకలు ఏ పాటివో అర్థం అవుతూనే ఉన్నాయన్నది తెలుస్తోంది.
తాజాగా.. విజయవాడలో జరిగిన ఘటన కూడా.. ఇప్పటిది కాదన్నది పోలీసు వర్గాలే చెబుతున్నాయి. దాదాపు 25 రోజుల కిందటే జరిగిందని విజయవాడ కోర్టులో దాఖలైన పిటిషన్లో వెలుగు చూసింది. మరి 20 రోజులుగా ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేదన్నది ప్రశ్న. అంతా బాగుందని అధికారులు చెప్పడంతో ఇదే నిజమని నమ్ముతున్న చంద్రబాబు ఆలోచన కొందరికి ఆయుధంగా మారుతోంది. తద్వారా.. ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తోందన్నది వాస్తవం. తరచుగా చంద్రబాబు చెబుతున్న 1995ల నాటి ముఖ్యమంత్రి బాబు నుంచి బయటకు వస్తే తప్ప.. ఈ పరిస్థితి బాగుపడదన్నది.. సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది.