అల్లు అర్జున్ నటించిన సంచలనాత్మక సినిమా.. పుష్ప-2 మూవీపై ఎలాంటి చర్చలు వద్దని.. సోషల్ మీడియాలోను.. వెబ్ సైట్లలో కూడా.. ఈ వ్యవహారంపై ఎలాంటి వార్తలు.. కంటెంట్ రాయొద్దని.. నాంప ల్లి కోర్టు ఆదేశాలు జారీచేసినట్టు.. సంధ్య ధియేటర్ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. పుష్ప-2 రిలీజ్ సమయంలో హైదరాబాద్లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
నాటి ఘటనలో హైదరాబాద్కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ గాయపడి కోలుకున్నారు. ఈ ఘటనపై నమోదైన కేసులో విచారణ తుదిదశకు చేరుకుంది. అయితే.. ఈ వ్యవహారంపై ఇటు సోషల్ మీడియాలోను.. అటు ప్రధాన మీడియాలోనూ పెద్ద ఎత్తున కథనాలు.. విశ్లేషణ లు.. అనధికార తీర్పులు.. వచ్చేస్తున్నాయని.. దీనిపై చర్యలు తీసుకోవాలని.. సదరు మీడియా కథనాల ను అడ్డుకోవాలని కోరుతూ.. సంధ్య థియేటర్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది.
ఈ పరిణామాలపై విచారణ జరిపిన కోర్టుకు పలు ఆధారాలను కూడా సమర్పించింది. వీటిని పరిగణన లోకి తీసుకున్న కోర్టు.. మీడియా సహా సోషల్ మీడియాలు సంయమనం పాటించాలని.. పుష్ప-2 ఘటనపై ఎలాంటి వార్తలు.. విశ్లేషణలు చేయడానికి వీల్లేదని.. నాటి ఘటనలకు సంబంధించిన ఫొటోలను కూడా ప్రచురించరాదని.. డిబేట్లు పెట్టరాదని పేర్కొంటూ.. ఉత్తర్వులు జారీ చేసిందని.. దీనిని మీడియా హౌస్లు.. సోషల్ మీడియా వారు పాటించాలని కోరుతూ.. సంధ్య థియేటర్ యాజమాన్యం తాజాగా ఓ నోటీసు జారీ చేసింది.
త్వరలోనే తీర్పు!
సంధ్య ధియేటర్లో చోటు చేసుకున్న ఘటనపై నమోదైన కేసులో సిట్ అధికారులు విచారణ జరిపారు. అలానే.. ప్రభుత్వం మరో విచారణ కమిటీని కూడాదర్యాప్తు చేయించింది. ఈ మొత్తం వ్యవహారం కోర్టుకు చేరింది. అనంతరం పలు దఫాలుగా జరిగిన విచారణ ముగిసిందని.. త్వరలోనే కోర్టు తీర్పు వెలువరించ నుందని.. సంధ్య ధియేటర్ యాజమాన్యం పేర్కొంది. తీర్పు ఎలా వచ్చినా స్వాగతిస్తామని.. కోర్టులపై నమ్మకం ఉందని వ్యాఖ్యానించింది.