సింగపూర్(Singapore) లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు(cm chandrababu).. తాజాగా సోమవారం సాయంత్రం సింగపూర్ ప్రధాన మంత్రి(Singapore Prime Minister) లారెన్స్ వాంగ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాంగ్ను ఏపీ రాజధాని అమరావతి(Amaravati)కి ఆహ్వానించారు. ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలను పరిశీ లించాలని కోరారు. సింగపూర్ ఇంజనీర్ల సౌజన్యంతో అమరావతి నిర్మాణాలను చేపట్టామని గతాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత నిర్మా ణాలలోనూ సింగపూర్ నిపుణుల సహకారం తీసుకుంటున్నట్టు వివరించారు. రాజధాని పనులు వడివడిగా ముందుకు సాగుతున్నాయని వివరించారు. తొలిదశ పనులు 2028 నాటికి పూర్తయ్యేలా కార్యాచరణను సిద్ధం చేసినట్టు వివరించారు.
ఆయా పనులను పరిశీలించాలని.. సలహాలు, సూచనలు ఇవ్వాలని వాంగ్ను సీఎం చంద్రబాబు కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు.. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగాలపై చంద్రబాబు సింగపూర్ ప్రధానికి వివరించారు. సాంకేతికత, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా.. ఇతర అన్ని రంగాల్లోనూ పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. ఆయా రంగాల్లో ఏపీకి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.. ముఖ్యంగా సెమీ కండెక్టర్ల తయారీ లో సహకరించాలని సూచించారు. ప్రస్తుతం సింగపూర్.. సెమీకండెక్టర్లలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేశారు.
ఏపీ నుంచి ఎగుమతులు..
ఏపీ నుంచి పలురకాల ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న సీఎంచంద్రబాబు విజ్ఞప్తికి సింగపూర్ ప్రధాని సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా ఉద్యనవన పంటలను, పండ్లను దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇస్తామని తెలిపినట్టు ఏపీ అధికారులు వివరించారు. అలానే.. వ్యవసాయ విధానాల్లోనూ సహకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రకృతి సేద్యం విధానంలో చేపట్టే పంటలకు ఇంజనీరింగ్ సహకారం అందిస్తామని చెప్పారు. ఓడరేవులు, విమానాశ్రయాల నిర్మాణంలోనూ సింగపూర్ టెక్నాలజీని వినియోగించుకునేలా సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దీనికి కూడా వాంగ్ ఓకే చెప్పారు.