కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పేరుతో ఉద్యమ పార్టీని స్థాపించి.. దేశంలో అత్యంత తక్కువ కాలంలోనే గుర్తింపు పొందిన అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. కొందరు యువకులు టార్గెటెడ్గా ఆయనను కొట్టారు. దేశంలో కాక్రోచ్ పార్టీకి యువత మొగ్గు చూపుతు న్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకైన వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ నిరసనలు వ్యక్తం చేస్తోంది. ఢిల్లీలో తొలి నిరసన నిర్వహించి.. నీట్ ప్రశ్న పత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబట్టారు.
ఇదే డిమాండ్తో హైదరాబాద్లో కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఇందిరా పార్కు వద్ద నిరసన వ్యక్తం చేసింది. దీనికి ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ తటస్థ వ్యక్తులు, భారీ ఎత్తున యువత మద్దతు పలికారు. ఇలా.. తాజాగా సోమవారం రాజస్థాన్లోని జైపూర్లో కూడా కాక్రోచ్ జనతా పార్టీ నీట్పై నిరసన వ్యక్తం చేసింది. ఈ నిరసనలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా పాల్గొన్నారు. కార్యక్రమం ప్రశాంతంగా సాగిపోయింది. చివరిలో ఆయన భారీ ఎత్తున తరలి వచ్చిన యువతను ఉద్దేశించి మాట్లాడారు. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీపై కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకొంటోందని ఆరోపించారు. దీనిని ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదని తెలిపారు.
అభిజిత్ ప్రసంగిస్తున్న సమయంలో యువత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ మద్దతు కూడా తెలిపారు. అనంతరం.. కొందరు యువకులు.. అభిజిత్ను తమ భుజాలపైకి ఎత్తుకుని.. ఊరేగింపుగా వేదిక నుంచి జనాల మధ్యకు తీసుకువచ్చారు. అంతే.. మధ్యలోకి రాగానే.. కొందరు యువకులు.. అభిజిత్ చెంపలపై ఉన్నపళాన విరుచుకుపడ్డారు. వరుస పెట్టి ఆయనపై దాడి చేశారు. దీంతో తన ముఖాన్ని రక్షించుకునేందుకు అభిజిత్ తీవ్ర యాతన పడ్డారు. ఇక, ఆయనను భుజాలపై ఎత్తుకుని మోస్తున్న వారు కూడా.. అక్కడే నిలబడి పోయారు.. తప్ప ఆయనను కాపాడే ప్రయత్నం చేయలేదు. దీనిని బట్టి ఉద్దేశ పూర్వంగానే దాడి జరిగిందని దీప్కే అనుచరులు పేర్కొన్నారు.
ఖండనలు..
దీప్కేపై దాడి ఘటనను సామాజిక ఉద్యమకారుడు.. సోనమ్ వాంగ్ చుక్ సహా.. పలువురు ఖండించారు. దాడిపై కేసు నమోదు చేయాలని .. బాధ్యులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు వెనుకాడినట్టు తెలిసింది. దీనిపైనా స్టేషన్ ముందు.. కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళనలకు దిగినట్టు జాతీయ మీడియా పేర్కొంది.
ఈ దాడి చేసిన యువకుడిపై కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి దాడి చేశారు. అయితే, యువతను అభిజీత్ తప్పుదోవ పట్టిస్తున్నాడని, అందుకే దాడి చేశానని ఆ యువకుడు తన చర్యను సమర్థించుకున్నాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు.