అనుకున్నదొక్కటి.. అయింది ఒక్కటి అన్నట్టుగా ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల(sharmila) విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం.. రాజకీయంగా చర్చకు దారితీసింది. ఇటీవల ఆమె.. పార్టీ అధిష్టానాన్ని కలుసుకున్నారు. ఈ భేటీకి భర్త అనిల్కుమార్ను కూడా తీసుకువెళ్లారు. దీంతో షర్మిలను రాజ్యసభ(rajyasabha)కు పంపిస్తున్నారన్న వార్త జాతీయస్థాయిలో వెలుగు చూసింది. ఇక, ఏపీ, తెలంగాణల్లోనూ.. షర్మిల మద్దతు దారులు సంబరాలు చేసుకున్నారు.
కానీ.. తాజాగా ఆమెకు రాజ్యసభసీటు కేటాయించలేదు. గురువారం రాత్రం పొద్దు పోయిన తర్వాత.. పార్టీ అధిష్టానం రాజ్యసభ స్థానాలకు సంబంధించి ప్రకటన జారీ చేసింది. దేశవ్యాప్తంగా 24 రాజ్యసభ స్థానాల కు ఈ నెల 18న ఎన్నికల పోలింగ్ జరగనుంది. వీటిలో తన మిత్ర పక్షాలకు పోను.. మిగిలిన స్థానాలకు సంబంధించి కాంగ్రెస్(congress) పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ముఖ్యంగా కర్ణాటక నుంచి మూడు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది.
అయితే.. ఇక్కడ నుంచే షర్మిలకు అవకాశం ఇస్తారని ఆది నుంచి ప్రచారం జరిగినా.. ఆమెకు అవకాశం చిక్కక పోవడం గమనార్హం. కర్ణాటకలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతుండగా.. అధికార కాంగ్రెస్కు మూడు స్థానాలు దక్కుతున్నాయి. వీటిలో మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడు.. మల్లికార్జున ఖర్గే, జాతీయ నేత, సీనియర్ నాయకుడు పవన్ ఖేరా, మన్సూర్ అలీఖాన్లకు పార్టీ అవకాశం ఇచ్చింది. పోనీ ఇతర రాష్ట్రాల నుంచి అయినా షర్మిలకు అవకాశం లభించిందా? అంటే లేదు.
దీంతో షర్మిల పరిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. మరోసారి రాజ్యసభ స్థానాలు ఖాళీ కావాలంటే.. దాదాపు 2027 చివరి వరకు ఆమె వెయిట్ చేయాలి. అంతేకాదు.. అప్పటికి .. ఖాళీ అయ్యే స్థానాలు దాదాపు బీజేపీకి వెళ్లనున్నాయి. ఒకటి అర స్థానాలు మాత్రమే కాంగ్రెస్కు దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిలకు దక్కే అవకాశం లేదు. దీంతో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఏపీ రాజకీయాలకే పరిమితం అవుతారా? లేక.. ఏం చేస్తారనేది చూడాలి. కాగా.. ఇటు షర్మిల కానీ.. అటు కాంగ్రెస్ కానీ.. ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తున్నట్టుగా ఎక్కడా ప్రకటన చేయలేదు.