ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని నియోజకవర్గాలకు ఉండే క్రేజ్ వేరు. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒక ఎత్తు, మూడు నియోజకవర్గాలు ఒక ఎత్తు అన్నట్లుగా రాజకీయం నడిచింది. కూటమి తరఫున అత్యంత కీలక నేతలు బరిలో ఉన్న ఆ మూడు స్థానాలను ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) భారీ వ్యూహాలే రచించారు. పక్కా స్కెచ్తో, సర్వశక్తులూ ఒడ్డి అటు కుప్పం, ఇటు మంగళగిరి, మరోవైపు పిఠాపురంలో చక్రం తిప్పాలని చూశారు. కానీ, సీన్ కట్ చేస్తే ఆ మూడు చోట్లా జగన్ వేసిన స్కెచ్ పూర్తిగా రివర్స్ అయింది. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కోట అయిన కుప్పంలో ఈసారి ఎలాగైనా జెండా పాతాలని వైసీపీ గత ఐదేళ్లూ తీవ్రంగా శ్రమించింది. అధికార బలం, అంగబలం, అర్ధబలం అన్నీ ఉపయోగించి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటినప్పటికీ.. అసలు సమరంలో మాత్రం బోల్తా పడింది. చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గంలోనే కట్టడి చేయాలనే వ్యూహంతో అప్పట్లో మంత్రులు, ఎంపీలు అక్కడే డెరా వేశారు. కోట్ల రూపాయల నిధులు కుమ్మరించారు. కానీ, ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్ ఫలితాల తర్వాత నియోజకవర్గానికి దాదాపు దూరమయ్యారు. ఒకప్పుడు అధికారంతో ఊగిపోయిన కేడర్ ఇప్పుడు కనీసం పార్టీ జెండా కట్టడానికి కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొంది.
అటు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ ఆడిన మైండ్ గేమ్స్ అన్నీ ఇన్నీ కావు. పవన్ను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వకూడదనే ఏకైక లక్ష్యంతో కాపు సామాజికవర్గానికి చెందిన బలమైన మహిళా నేత వంగా గీతను రంగంలోకి దించారు. స్థానిక సమీకరణాలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని భావించారు. అయితే, పవన్ కళ్యాణ్ ప్రభంజనం ముందు వైసీపీ స్కెచ్ ముక్కలైపోయింది. భారీ ఓటమితో పిఠాపురంలో వైసీపీ అడ్రస్ గల్లంతయింది. ఎన్నికల తర్వాత పార్టీకి అండగా ఉంటారనుకున్న కీలక నేత దొరబాబు జనసేన గూటికి చేరడంతో వైసీపీ అక్కడ పూర్తిగా ఒంటరిదైపోయింది. ఇప్పుడు పిఠాపురంలో వైసీపీ తరఫున గొంతు వినిపించే నాథుడే కరువయ్యాడు.
ఇక మంగళగిరి నియోజకవర్గంపై వైసీపీ పెట్టుకున్న నమ్మకం అంతా ఇంతా కాదు. గతంలో నారా లోకేష్(Nara Lokesh)ను ఓడించామన్న ధీమాతో, ఈసారి కూడా ఆయన్ని ఎలాగైనా దెబ్బతీయాలని జగన్ రకరకాల ప్రయోగాలు చేశారు. సామాజిక సమీకరణాలను నమ్ముకుని అభ్యర్థులను మార్చారు. కానీ, నారా-నందమూరి కుటుంబాలు క్షేత్రస్థాయిలో చేసిన విస్తృత ప్రచారం, వైసీపీ అంతర్గత విభేదాలు ఆ పార్టీ కొంపముంచాయి. లోకేష్ రికార్డు స్థాయి మెజార్టీతో గెలవడమే కాకుండా.. ఇప్పుడు అక్కడ వైసీపీని కోలుకోలేని దెబ్బతీశారు. ప్రస్తుతం మంగళగిరిలో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన మహిళా నాయకురాలు పత్తా లేకుండా పోగా.. మాజీ మంత్రి ఒకరు ఏకంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ సొంత పార్టీకే షాకిస్తున్నారు.
మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలోని టాప్ లీడర్లను టార్గెట్ చేస్తూ వైసీపీ(YCP) వేసిన ఈ పొలిటికల్ స్కెచ్లు ఆ పార్టీకే రివర్స్ అయ్యాయి. పట్టు సాధించాల్సింది పోయి.. కనీసం క్యాడర్ను కాపాడుకునే దిక్కు కూడా లేకపోవడంతో కుప్పం, మంగళగిరి, పిఠాపురంలో వైసీపీ కథ ప్రస్తుతానికి ముగిసినట్లేనా అనే చర్చ నడుస్తోంది.