సార్వత్రిక ఎన్నికల కోలుకోలేని దెబ్బ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ ట్రాక్లోకి తెచ్చేందుకు తాడేపల్లి ప్యాలెస్ వేదికగా జరిగిన ఒక అంతర్గత సమీక్ష.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రీజినల్ కో-ఆర్డినేటర్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకు దిశా నిర్దేశం చేసేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ఒక పొలిటికల్ వర్క్షాప్ నిర్వహించారు. అయితే, క్యాడర్లో జోష్ నింపాల్సిన ఈ సమావేశం కాస్తా, సీనియర్ లీడర్లలో తీవ్ర గందరగోళాన్ని, కొత్త టెన్షన్ను రేకెత్తించింది.
నిజానికి, ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా చాలా స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తుంది. ప్రత్యర్థులు చేర్పించే అక్రమ ఓట్లను అడ్డుకోవడం, తమకు పడే అసలైన ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవడంపైనే గ్రౌండ్ లెవెల్ లీడర్లకు టాస్క్లు ఇస్తుంటారు. కానీ, తాడేపల్లి(Tadepalli) క్లాస్రూమ్లో జగన్ రెడ్డి వినిపించిన సరికొత్త ఓట్ల ఈక్వేషన్ విని సొంత పార్టీ నేతలే షాక్కు గురయ్యారు. ఏపీలో గతంలో ఓట్లు విపరీతంగా పెరగడం వల్లే వైసీపీ ఇంత దారుణంగా దెబ్బతిన్నదనే విచిత్రమైన లాజిక్ను ఆయన తెరపైకి తెచ్చారు. అంతేకాదు, బెంగాల్, తమిళనాడులలో ఓట్లు తగ్గించడం వల్లే అక్కడి అధికార పార్టీలు నష్టపోయాయంటూ జాతీయ స్థాయి ఉదాహరణలను కూడా వల్లె వేశారు.
ఈ ‘పెంచినా డేంజరే.. తగ్గించినా డేంజరే’ అనే వింత థియరీ విన్న పార్టీ పెద్దలకు అసలు మ్యాటర్ అర్థం కాక బుర్రలు పాడైపోయాయి. మరి ఇప్పుడు క్షేత్రస్థాయిలో మేము ఓట్లను పెంచేలా చూడాలా? తగ్గించేలా చూడాలా? లేక ఏమీ తెలియనట్లు గమ్మున కూర్చోవాలా? అని లోలోపలే లబోదిబోమంటున్నారు. కూటమి ప్రభుత్వం దూకుడు మీదున్న తరుణంలో.. ఇలాంటి అయోమయ సిద్ధాంతాలతో కాలక్షేపం చేస్తే, వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న ఆ 11 సీట్ల ముచ్చట కూడా దక్కడం కష్టమేనని, మొత్తానికే గోవిందా అవ్వడం ఖాయమని వైసీపీ(YCP) ఇన్ఛార్జ్లు తెగ మదనపడిపోతున్నారు.
ఇక ఈ సమావేశంలో అసలు సిసలైన హైలైట్ ఏంటంటే.. సాంకేతిక అంశాలతో కూడిన ఈ ఓటర్ల సవరణ చిట్టాను, సుదీర్ఘమైన నివేదికలను జగన్ రెడ్డి స్వయంగా చదివి లీడర్లలో నమ్మకం కలిగిస్తారని అంతా ఆశించారు. కానీ, ఆ సబ్జెక్టుతో తనకు ఏమాత్రం సంబంధం లేనట్లుగా, మైక్ తీసుకెళ్లి పక్కనే ఉన్న మాజీ మంత్రి కురసాల కన్నబాబు(Kurasala Kannababu) చేతిలో పెట్టారు. కన్నబాబు ఏదో స్కూల్ లెక్చరర్లా ఆ పీడీఎఫ్ ప్రతులను చదువుతుంటే.. మన అధినేత పక్కన కూర్చుని కేవలం తలూపడానికే పరిమితమయ్యారు. క్లిష్టమైన సమయంలో పార్టీని ముందుండి నడిపించాల్సిన బాసే ఇలా నామ్కేవాస్తేగా వ్యవహరించడం చూసి, సమావేశానికి వచ్చిన లీడర్లంతా ముక్కున వేలేసుకుని కారు ఎక్కేశారు.