పశ్చిమ బెంగాల్(West Bengal) రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఎన్నికల ప్రచారంలో విపక్షాలు సృష్టించిన సెంటిమెంట్ భయాలను పటాపంచలు చేస్తూ నూతన ముఖ్యమంత్రి సువేందు అధికారి తీసుకున్న కొన్ని సంచలన నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా బెంగాలీయుల జీవన విధానంతో విడదీయరాని బంధం ఉన్న చేపల భోజనం చుట్టూ తిరిగిన రాజకీయ మైండ్ గేమ్కు సీఎం సువేందు తనదైన శైలిలో శాశ్వత చెక్ పెట్టారు.
ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తూ.. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి సంస్కృతి అంతరిస్తుందని, ప్రజలను చేపలు కూడా తిననివ్వకుండా శాకాహార విధానాలను బలవంతంగా రుద్దుతారంటూ ఓటర్లలో ఒకరకమైన భయాన్ని కల్పించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే, బెంగాలీ సంప్రదాయంలో చేపల కూరను పూజలు, పండగల్లోనూ పవిత్రంగా, ఒక రకమైన శాకాహారంగానే భావిస్తారు. అయితే, ఈ బలమైన సెంటిమెంట్ను క్యాష్ చేసుకోవాలని చూసిన దీదీ వ్యూహాన్ని కొత్త ముఖ్యమంత్రి తిప్పికొట్టారు. తాను కూడా పక్కా బెంగాలీనని చాటుకుంటూ.. కేవలం 5 రూపాయలకే నాణ్యమైన చేపల కూర-అన్నం అందించే సరికొత్త ప్రభుత్వ పథకానికి శ్రీకారం చుట్టారు. గతంలోని ‘మా కిచెన్’ పథకం కంటే రెట్టింపు నాణ్యతతో, బెంగాలీ సంస్కృతి మార్కుతో రూపుదిద్దుకున్న ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి వర్గాల హృదయాలను విపరీతంగా గెలుచుకుంటోంది.

కేవలం ఐదు రూపాయల భోజనానికే పరిమితం కాకుండా, మమతా బెనర్జీ ప్రభుత్వానికి సింబల్గా ఉన్న మహిళల ఆర్థిక సాయం పథకం ‘లఖ్మీ భండార్’ పై కూడా సువేందు సర్కార్ గట్టి దెబ్బ కొట్టింది. గత టీఎంసీ ప్రభుత్వం మహిళలకు నెలకు కేవలం రూ. 1000 నుండి రూ. 1200 మాత్రమే ఇస్తుండగా.. నూతన ప్రభుత్వం ఆ మొత్తాన్ని ఏకంగా రూ. 3,000 లకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ భారీ పెంపునకు సంబంధించిన మొదటి విడత నగదు బదిలీని కూడా సీఎం స్వయంగా ప్రారంభించడంతో బెంగాలీ మహిళా ఓటర్లలో సువేందు అధికారి(Suvendu Adhikari) గ్రాఫ్ ఒక్కసారిగా దూసుకుపోయింది. విమర్శలకే పరిమితం కాకుండా, చేతల్లో సంక్షేమాన్ని చూపిస్తూ అధికారంలోకి రాగానే సీన్ మార్చేసిన కొత్త సీఎం స్టెప్స్ ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.