హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(pm modi).. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``మీకు పనులు కావాలంటే.. మీరు నాతో కలవాలి.`` అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. ఈ సమయంలో ప్రధాని మోడీ నవ్వుతూనే ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ.. సభలో ఉన్న వారు ఆశ్చర్యపోయారు. సీఎం రేవంత్(cm revanth) ముసిముసినవ్వుల్లో మునిగిపోయారు.
ఏం జరిగింది?
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. మోడీ తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా 9 వేలకోట్ల రూపాయల పైచిలుకు వ్యయంతో రూపొందించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ``నేను రేవంత్ రెడ్డితో చెప్పదలుచుకున్నదేమిటంటే.. కేంద్ర ప్రభుత్వం తన 10 ఏళ్ల పాలనలో గుజరాత్కు ఏమి ఇచ్చిందో.... అదంతా మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నాకున్న సమాచారం ప్రకారం... నేను అలా చేసిన వెంటనే మీరు ప్రస్తుతం పొందుతున్నది(కాంగ్రెస్ అధిష్టానం దగ్గర గౌరవం) సగానికి తగ్గిపోతుంది. మీరు వెళ్లాలనుకున్న చోటికి చేరుకోలేరు. కాబట్టి మీరు నాతోనే పొత్తు పెట్టుకోవడం మంచిది.`` అని వ్యాఖ్యానించారు.
ఇక, తెలంగాణ యువత కొత్త కలలు కంటున్నారన్న ప్రధాని.. ఇక్కడి రైతులు కొత్త ఆశలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు.. అన్నీ అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణంలో తమ పాత్ర పోషించాలని కోరుకుంటున్నాయన్నారు. ``ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి చెందితే, భారతదేశం అభివృద్ధి చెందుతుంది. మీ కలలను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరింత వేగంగా పనిచేయడం కొనసాగిస్తుందని తెలంగాణలోని ప్రతి కుటుంబానికి నేను హామీ ఇస్తున్నాను.`` అని వ్యాఖ్యానించారు.
సీఎం ఏమన్నారు..
తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ``అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మీరు(ప్రధాని) ఎంత తీవ్రతతో కృషి చేస్తున్నారో ఆ వేగంతో పనులు ముందుకు సాగకపోతే ఇబ్బందులు వస్తున్నాయి. తెలంగాణ కూడా మీతో చేతులు కలపాలనుకుంటోంది. దేశ జీడీపీలో తెలంగాణ 10% వాటాను అందించబోతోందని మేము హామీ ఇస్తున్నాము. దీని కోసం మాకు కొన్ని అనుమతులు, క్లియరెన్సులు.. దీంతోపాటు మీ మద్దతు అవసరం.`` అన్నారు. ఈ క్రమంలోనే మీరు మాతో పొత్తు పెట్టుకుంటే.. మీకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం