పెళ్లై.. జీవితం సాఫీగా సాగిపోతున్న.. దక్కిన దానికి మించిన దాని కోసం ఆరాటపడటం.. అందుకోసం అడ్డదిడ్డంగా వ్యవహరించటం.. చివరకు కట్టుకున్నోడ్ని చంపేందుకు సైతం వెనుకాడని కొందరు భార్యల ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి దుర్మార్గమైన ఉదంతం ఒకటి ఉమ్మడి కడప(Kadapa) జిల్లా పొద్దుటూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. మిగిలిన ఉదంతాలకు ఈ ఉదంతానికి తేడా ఏమంటే.. భార్య ఎంత భారీగా ప్లాన్ చేసినా.. భర్త తప్పించుకోవటమే కాదు.. బతికిపోయాడు. ప్రియుడి కోసం దారుణప్లాన్ వేసిన పాపం పండి.. ఆమె.. ఆమె ప్రియుడు.. సుపారీతో హత్య చేసేందుకు సిద్ధమైనోడు జైలుఊచలు లెక్కిస్తున్నాడు. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
పదేళ్ల క్రితం ఈశ్వర్ రెడ్డి(Easwar Reddy).. శిల్పారెడ్డికి పెళ్లైంది. కొన్నిరోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో శిల్పారెడ్డికి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో పని చేస్తున్న పెళ్లైన నాగసుధీర్ పరిచయమయ్యాడు. జమ్మలమడుగుకు చెందిన ఇతనితో పరిచయం ముందుకు వెళ్లి వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలిసిన భర్త శిల్పారెడ్డిని మందలించాడు. అయినా ఆమె తన తీరు మార్చుకోలేదు. కొంతకాలంగా వారి మధ్య ఈ పంచాయితీ ముదిరిపోయింది.
ఈ నేపథ్యంలో తన సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలన్న దారుణ ప్లాన్ కు తెర తీసింది శిల్పారెడ్డి(Shilpa Reddy). ఈ విషయాన్ని ప్రియుడికి చెబితే.. అతను ఓకే చెప్పాడు. అతను రౌడీషీటర్ వినయ్ ను సంప్రదించి.. అతని ద్వారా హిందూపురానికి చెందిన కిరాయి ముఠాకు రూ.10 లక్షల సుపారీకి డీల్ మాట్లాడుకున్నారు. ఈ దారుణ ఉదంతంలో మరో షాకింగ్ కోణం ఏమంటే.. హత్యకు సంబంధించి ప్లాన్ ఏ.. ప్లాన్ బి సిద్ధం చేసుకున్నారు.ఒకవేళ తాము వేసుకున్న ప్లాన్ వర్కువుట్ కాకుంటే.. వెంటనే ప్లాన్ బి యాక్టివేట్ చేసి.. చంపేయాలని ప్లాన్ చేశారు.
సుపారీ డబ్బుల కోసం తన బంగారాన్ని అమ్మిన శిల్పారెడ్డి రూ.5 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చింది. మిగిలిన మొత్తాన్ని పని పూర్తి అయ్యాక ఇచ్చేలా మాట్లాడుకున్నారు. తమ ప్లాన్ లో భాగంగా సుపారీ ముఠా ప్రొద్దుటూరుకు చేరుకొని హత్యకు ప్లాన్ చేశారు. భర్త ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? ఏ రూట్ లో వెళుతున్నాడు? ఇలాంటి వివరాల్ని శిల్పలారెడ్డి ఎప్పటికప్పుడు ప్రియుడికి అందించేది.
టూవీలర్ మీద వెళ్లే భర్తను బలంగా ఢీ కొట్టి.. కింద పడిన తర్వాత కత్తులతో పొడిచి చంపేలా ప్లాన్ చేసుకున్నారు. ఖొవేళ ఆ ప్లాన్ ఫెయిల్ అయితే.. పొలం వద్ద నరికి చంపాలని నిర్ణయించుకున్నారు. వారు అనుకున్నట్లే.. ప్రొద్దుటూరు(Proddatur) బైపాస్ రోడ్డులో ఈశ్వర్ రెడ్డి బైక్ మీద వెళుతుండగా.. కారుతో బలంగా ఢీ కొట్టారు. అక్కడితో ఆగకుండా కత్తులతో చంపే ప్రయత్నం చేశారు. బాధితుడు వారి నుంచి తప్పించుకొని పోలీసుల్ని ఆశ్రయించారు. అతడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు భార్య శిల్పారెడ్డిని.. ప్రియుడు నాగసుధీర్ తో పాటు సుపారీ గ్యాంగ్ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి.. విచారణ చేస్తున్నారు. హత్యకు ప్లాన్ చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.