దివంగ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు.. ఏపీ మాజీ సీఎం జగన్ చిన్నాన్న.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన కుమార్తె సునీతారెరడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయిచారు. తన తండ్రి హత్య కేసులో జగన్ సహా ఇతరుల పాత్ర ఏమిటో తేల్చాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ హత్య కేసులో విచారణ పలు కోణాల్లో జరగాలని.. ఈ మేరకు పూర్తిస్థాయిలో తదుపరి దర్యాప్తు చేపట్టేలా సీబీఐకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు,
ఈ సందర్భంగా ఆమె దాఖలు చేసిన పిటిషన్ లో పలు సందేహాల్ని లేవనెత్తారు. ఈ హత్య కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో తదుపరి దర్యాప్తు చేపట్టేలా సీబీఐకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన సోమవారం విచారణ చేపట్టారు. సునీతారెడ్డి తరఫున న్యాయవాదులు ఎస్ గౌతమ్, లిఖిత్రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషన్ లో సునీత పేర్కొన్న అంశాల్ని చూస్తే..
- మాజీ సీఎస్ అజేయ కల్లం స్టేట్మెంట్ ప్రకారం ఉదయం 5.30 గంటలకే వివేకా మరణ వార్త జగన్.. భారతిలకు తెలిసిందని.. అధికారికంగా ప్రకటించడానికి ముందే వారికి మరణ వార్త ఎలా తెలిసింది?
- జగన్ సతీమణి భారతికి ఎవరు ఫోన్ చేశారు? ఏం చెప్పారనే విషయాలను సీబీఐ పట్టించుకోలేదు. వాటిపై దర్యాప్తు చేయలేదు.
- తదుపరి దర్యాప్తును ఒక కోణానికే పరిమితం చేస్తూ ఇటీవల నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్యాదవ్కు.. వైఎస్ ప్రకాశ్రెడ్డి మనవడు అర్జున్రెడ్డికి మధ్య జరిగిన సందేశాలపై మాత్రమే దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది.
- వారిద్దరి సంభాషణల్లో ఏమీ లేదు. కొత్తగా ఎలాంటి ఆధారాలూ లభించలేదని.. దర్యాప్తును మూసేయాలని సీబీఐ ఇటీవల అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది.
- తదుపరి దర్యాప్తు అంశాన్ని సీబీఐ కోర్టు ఒకే ఒక్క చిన్న అంశానికి పరిమితం చేయడం.. అందులో ఏమీ లేదని సీబీఐ చార్జిషీటు వేశారు. ఈనేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేలా సీబీఐకి ఆదేశాలు జారీచేయాలి.
- హత్య కేసులో జగన్, కె.గంగాధర్రెడ్డి, ఎం. ఓబుల్రెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, సయ్యద్ మున్నా, కిరణ్యాదవ్, అర్జున్రెడ్డి, గొర్ల భరత్ యాదవ్, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, లోవరాజు తదితరుల పాత్ర ఏమిటో తేల్చేందుకు తదుపరి దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించాలి.
- హత్య జరిగిన రోజు (15-03-2019) కిరణ్ యాదవ్, అర్జున్రెడ్డి మధ్య సంభాషణలకు ఎలాంటి ప్రాధాన్యం లేదని సీబీఐ పేర్కొంది. కిరణ్ యాదవ్ కాల్రికార్డుల ప్రకారం అతడి మొబైల్ నంబర్ నుంచి ఏ-1 ఎర్ర గంగిరెడ్డికి కాల్ వెళ్లింది. 42 సెకన్లు వాళ్లు మాట్లాడుకున్నారు. ఏ-3 ఉమాశంకర్రెడ్డికి సైతం కాల్ వెళ్లింది. సీబీఐ ఈ విషయాలన్నీ పట్టించుకోకుండా వదిలేసింది.
- ఏ-2 సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ స్టేట్మెంట్కు.. వారి తల్లి సావిత్రి స్టేట్మెంట్ పూర్తి విరుద్ధంగా ఉంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో సునీల్ యాదవ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని తల్లి సావిత్రి చెప్పగా.. రాత్రి మొత్తం ఇంట్లోనే ఉన్నాడని కిరణ్ యాదవ్ స్టేట్మెంట్లో ఉంది.
- కిరణ్ యాదవ్ రాత్రంతా యాక్టివ్గా ఇంటర్నెట్ వినియోగించినట్లు డేటా చెబుతోంది. సీబీఐ దాఖలు చేసిన మూడో అనుబంధ చార్జిషీటు చూస్తే.. దర్యాప్తును నామమాత్రంగా చేసినట్లు తేటతెల్లమవుతోంది.
- కిరణ్యాదవ్, అర్జున్రెడ్డి సంభాషణలపై దర్యాప్తు చేయాలని కోర్టు పరిమితంగా ఇచ్చిన ఆదేశాలను కూడా సీబీఐ పాటించలేదు. ఈ చిన్న కోణాన్ని కూడా సరిగా దర్యాప్తు చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరగాలి.
- వివేకా చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించడానికి ముందే అత్యంత పెద్ద పొలిటికల్ లీడర్లకు (జగన్) వివేకా మరణ వార్త ఎలా తెలిసింది? వారికి ఎవరు ఫోన్ చేశారు? ఏం చెప్పారు? హత్య కోసం వాడిన ఆయుధాలు ఏమయ్యాయి?
- ఏ-4 దస్తగిరితో ముడిపడి ఉన్న.. వివరణ లేని డబ్బు, బంగారు ఆభరణాల విషయంలో సీబీఐ ఏం తేల్చింది?
- వివేకా హత్య జరిగిన తర్వాత ఆధారాల చెరిపివేత విషయంలో ఎంవీ కృష్ణారెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి పాత్ర ఏంటి? రిటైర్డ్ పోలీసులను పెట్టుకుని సాక్షులను ఒక పద్ధతి ప్రకారం బెదిరించడం.. విస్తృత స్థాయి కుట్రను బయటకు తీయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై సీబీఐ ఏం చేసింది.. వంటి విషయాలన్నీ తేలాల్సి ఉంది.
- మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు నిందితుడు వైఎస్ భాస్కర్రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించడానికి అనుమతివ్వవద్దు.
సునీత తరఫు న్యాయవాదులు కోర్టులో వినిపించిన వాదనల్లోని కొన్ని అంశాలు
- పూర్తి స్థాయిలో తదుపరి దర్యాప్తు జరిగితే వివేకా హత్య కేసులో స్పష్టత వస్తుంది.
- హత్యకు సంబంధించిన అంశం బాధితురాలైన సునీతారెడ్డికి, సీబీఐకి మధ్య వ్యవహారం. నిందితులు శివశంకర్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి తదితరుల వాదనలు వినాల్సిన అవసరం లేదు.
సీబీఐ న్యాయవాది శ్రీనివాస్ కపాటియా ఏం చెప్పారు?
- సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. మొదటిసారి విచారణకు వచ్చినందున కౌంటర్ దాఖలుకు 2 వారాల సమయమివ్వాలి.
ధర్మాసనం ఏం చెప్పింది
వాదనలు విన్న ధర్మాసనం.. సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.