రోటీన్ కు భిన్నంగా.. చిత్ర.. విచిత్ర నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది కర్ణాటక. గడిచిన కొద్దికాలంగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన నేరాలకు నెలవుగా ఆ రాష్ట్రం నిలుస్తోంది. తాజాగా ఆ కోవలోకే చెందిన ఒక క్రైం వెలుగు చూసింది. సాధారణంగా జిమ్ ట్రైనర్ కావొచ్చు.. మరొకరు కావొచ్చు. అబ్బాయిల వేధింపులు తాళలేక అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకోవటం తరచూ చూసేదే. తాజా ఉదంతం అందుకు భిన్నం. ఒక వివాహిత వేధింపులను తట్టుకోలేని ఒక జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకున్న వైనం కలకలాన్ని రేపుతోంది.
కర్ణాటకలోని బెంగళూరు మహానగర పరిధిలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. గార్డెన్ సిటీ శివారులోని నెలమంగల సమీపంలోని వాజరహళ్లికి చెందిన దిలీప్ జిమ్ ట్రైనర్ గా వ్యవహరిస్తుంటారు. తాజాగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకును ఒక మహిళ వేధింపులకు గురి చేసుకుందని.. అది భరించలేకనే తన కొడుకు సూసైడ్ చేసుకున్నట్లుగా బాధితుడి తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా.. ఆత్మహత్య చేసుకున్న దిలీప్.. తాను సూసైడ్ చేసుకోవటానికి ముందు..ఒక మహిళకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదే విషయాన్ని పోలీసులు తమ విచారణలో గుర్తించటం గమనార్హం. అసలేం జరిగిందంటే.. ఇద్దరు పిల్లలు ఉన్న వివాహిత ఒకరు కొద్ది కాలం క్రితం జిమ్ లో చేరారు. సదరు జిమ్ లో ట్రైనర్ గా పని చేస్తున్న దిలీప్.. సదరు వివాహితకు వ్యక్తిగత ట్రైనర్ గా వ్యవహరించేవారు. ఆ పరిచయం కాస్తా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి తెర తీసింది. అయితే.. ఈ విషయం కొద్దికాలానికే వివాహిత ఇంట్లో తెలిసింది.
దీంతో వివాదం మొదలై.. తీవ్ర రూపం దాల్చింది. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏడాది క్రితం ఇరు వర్గాలు పోలీసుల వద్ద పంచాయితీకి వెళ్లింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది.అప్పటి నుంచి సదరు వివాహితకు దిలీప్ దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. ఇదిలా ఉండగా తాజాగా దిలీప్ ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. వివాహిత పెడుతున్న వేధింపులను తాళలేకనే అతను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.