అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినా.. అప్పుడప్పుడు ప్రత్యర్థి పార్టీల నేతలు ఎదురుపడినప్పుడు జరిగే సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బిల్గేట్స్ స్థాయి ఏంటి.. మీ విమర్శలేంటి?
అసెంబ్లీ లాబీల్లో వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ వెళ్తుండగా, అక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, ఎంఎస్ రాజు, అశోక్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆయనను పలకరించారు. కుశలప్రశ్నల తర్వాత చర్చ ఒక్కసారిగా బిల్గేట్స్ అంశంపైకి మళ్లింది. ``బిల్గేట్స్ అంటే ఎవరో తెలుసా? ఆయన స్థాయి ఏంటో తెలుసా? అలాంటి ప్రపంచ కుబేరుడిని కూడా విమర్శించే స్థాయికి మీ పార్టీ దిగజారిపోయిందేంటి?`` అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్ను సూటిగా ప్రశ్నించారు.
ముఖ్యంగా ఎంఎస్ రాజు స్పందిస్తూ చంద్రశేఖర్పై సెటైర్ల వర్షం కురిపించారు. ``అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ లెక్కలు అడగాలి గానీ.. ప్రెస్మీట్లు పెట్టి మరీ బిల్గేట్స్ తాగే టీ, కాఫీ ఖర్చుల గురించి మాట్లాడటం ఏంటి? ప్రపంచం మొత్తం చూసి నవ్వుతోంది. అనవసరంగా ఇలాంటి విమర్శలు చేసి నవ్వులపాలయ్యారుగా..`` అంటూ పంచ్లు వేశారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు.
టీడీపీ నేతలు వరుస పెట్టి ప్రశ్నలు అడుగుతుండటంతో ఎమ్మెల్యే చంద్రశేఖర్ కాసేపు మౌనంగా ఉండిపోయారు. పరిస్థితిని గమనించిన ఆయన, ఇక ఇక్కడ ఉంటే లాభం లేదనుకున్నారో ఏమో.. ``అన్నీ తెలిసే నాతో ఆడుకుంటున్నారుగా.. ఇక చాలు, మీకో నమస్కారం!`` అంటూ రెండు చేతులు జోడించి నవ్వుకుంటూ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. ఈ దృశ్యాన్ని చూసిన మిగిలిన వారు.. ``వైసీపీ ఎమ్మెల్యేను టీడీపీ నేతలు భలే బుక్ చేశారు`` అంటూ చర్చించుకుంటున్నారు.