పవన్ కళ్యాణ్ మీద ఒక నెగెటివ్ బుక్ రాసి పాపులర్ అయ్యాడు బొగ్గుల శ్రీనివాస్ అనే రైటర్. ఆ పుస్తకం పేరు.. పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో. తెలంగాణకు చెందిన ఈ రచయిత ఈ పుస్తకం రాసి పవన్ అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. 2014లో పవన్ రాజకీయ పార్టీ ప్రకటించిన కొన్ని రోజులకే ఈ పుస్తకం వచ్చింది. ఈ బుక్ రిలీజైనపుడు తీవ్ర దుమారం రేగింది.
ఈ పుస్తకంతో గుర్తింపు తెచ్చుకున్న బొగ్గుల శ్రీనివాస్.. ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఖమ్మం జిల్లా కూసుమంచి వద్ద పాలేరు కాలువలో శ్రీనివాస్ శవమై తేలాడు. శ్రీనివాస్ ప్రయాణిస్తున్న కారు కాలువలోకి దూసుకెళ్లగా.. అతను ఊపిరాడక చనిపోయాడు. ఐతే ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్ అక్కడి నుంచి పరారవడం అనుమానాలకు తావిస్తోంది.
పవన్ మీద నెగెటివ్ బుక్ రాసిన వ్యక్తి ఇలా చనిపోవడంతో.. కొందరు దీన్ని జనసేనానితో లింక్ చేసి వివాదం రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ బుక్ వ్యవహారం ఎప్పుడో ముగిసిన విషయం. ఐతే చనిపోవడానికి ముందు శ్రీనివాస్ రిలీజ్ చేసిన చివరి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకప్పుడు టీడీపీ, జనసేకు మద్దతుగా నిలిచి.. ఇప్పుడు వైసీపీ అనుకూలుడిగా మారిపోయి కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న లాయర్ జడ శ్రావణ్ కుమార్ మీద వీడియో చేశాడు శ్రీనివాస్. ఒకప్పుడు అమరావతి కోసం మాట్లాడి, వైసీపీ మీద విమర్శలు చేసిన శ్రావణ్ కుమార్.. ఇప్పుడు ఇలా స్టాండ్ మార్చుకోవడాన్ని తప్పుబడుతూ విమర్శలు చేశాడు శ్రీనివాస్. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు పవన్ పట్ల అతడికి వ్యతిరేకత ఏమీ లేదని అర్థమవుతోంది. ఈ వీడియో చేసిన తర్వాత అతను అనుమానాస్పద స్థితిలో మరణించడంతో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేసే అవకాశముంది.