తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణలు అంశం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని విచారణలో తేలిందని వైసీపీ చెబుతోంది. అయితే, అది అసలు నెయ్యి కాదని, కెమికల్స్ కలిపిన పామాయిల్ అని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ కమిషన్ వేయాలని చంద్రబాబు నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయానికి మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ఆ కమిటీ నివేదిక ఆధారంగా నెయ్యి కల్తీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయించారు. లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై సిట్ నివేదికలోని అంశాలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై మంత్రివర్గం చర్చించింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి విషయంలో అసలు సూత్రధారులను కనిపెట్టేందుకు ఈ విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీబీఐ ఏర్పాటు చేసిన సిట్ కేవలం పాత్రధారులపై మాత్రమే చర్యలకు సిఫార్సు చేసిందని మంత్రివర్గం అభిప్రాయపడింది.
కాగా, కూటమిలోని 3 పార్టీలకు చెందిన మంత్రులు లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై స్పందించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. సిట్ నివేదికపై మూడు పార్టీలకు చెందిన నేతలు అవగాహనతో మాట్లాడాలని, అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.