షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి జగన్ హయాంలో భూములు కేటాయించడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ సర్కార్ కు అనుకూలంగా ఉన్న ఈ కంపెనీకి గతంలో శేషాచలం వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వచ్చే భూమిని కేటాయించారని వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ప్రకారం పీసీసీఎఫ్కు ఆదేశాలిస్తూ విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
షిర్డిసాయి కంపెనీకి కేటాయించిన భూముల్లో అటవీ భూముల క్రమబద్దీకరణ చట్టం 1980 నిబంధనలు పూర్తిగా విస్మరించారని ఆరోపణలు వచ్చాయి. జగన్ హయాంలో కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సమీపంలోని ఐటీ సెజ్ భూములను డీనోటిఫై చేయించి దానిలో 49.8 ఎకరాలను షిర్డిసాయి సంస్థకు రూ.42.48 కోట్లకు నామమాత్రపు ధరకు జగన్ సర్కార్ కట్టబెట్టింది.
ఆ భూముల విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ.150 కోట్ల వరకు ఉంటుంది. ఆ విలువైన భూముల్లో షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ శుచి అల్లాయ్స్ అండ్ కండక్టర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని స్థాపించింది.అటవీశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఆ సంస్థ నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆ సంస్థకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై పవన్ స్పందించి నివేదిక కోరారు.