ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ అధినేత సజ్జల శ్రీధర్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణాన్ని కూటమి సర్కార్ సీరియస్గా తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో ఈ కేసులో దూకుడు పెంచిన సిట్ అధికారులు.. ఇటీవలె ముఖ్య సూత్రధారి రాజ్ కసిరెడ్డిని అదుపులో తీసుకున్నారు. తాజాగా సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు.
లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కమీషన్ల వ్యవహారంలో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. శుక్రవారం ఆయన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించారు. శనివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు ముగిసిన అనంతరం శ్రీధర్ రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్ కేసుపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. శ్రీధర్ రెడ్డికి వచ్చే నెల 6వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
కాగా, గత వైసీపీ ప్రభుత్వంలో కొత్త మద్యం విధానం ముసుగులో నెలనెలా రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు అక్రమంగా ముడుపులు వసూలు చేసేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కుట్ర చేశారని బలమైన ఆరోపణలు వచ్చాయి. కుట్రలో భాగంగా జరిగిన సమావేశాల్లో నాటి ప్రభుత్వ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి, వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, అదే సంస్థ ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ వంటి వారు పాల్గొన్నట్లు కేసు దర్యాప్తులో తేలింది. సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా ఆ సమావేశాల్లో పాల్గొన్నారని సిట్ వర్గాలు చెబుతున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో శ్రీధర్ రెడ్డిని ఏ6గా చేర్చిన అధికారులు.. మద్యం లావాదేవీలు, కమీషన్ల వ్యవహారాలపై సిట్ కార్యాలయంలో ఆయన్ను విచారించారు.