రాజకీయ విభేదాల నేపథ్యంలో తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లతో కల్వకుంట్ల కవిత తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణ రక్షణ సేన పేరుతో కవిత కొత్త పార్టీ స్థాపించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తో తనకు విభేదాలు రావడానికి ముఖ్య కారణం ప్రశాంత్ రెడ్డి అని, జీవితంలో ఎవరిని క్షమించినా ప్రశాంత్ రెడ్డిని తాను క్షమించబోనని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పిరికిదాన్ని అనుకోవద్దని కవిత అన్నారు.
అయితే తనను పార్టీ నుంచి పంపించిన కారణం స్పష్టం చేయలేదని కవిత కన్నీరు పెట్టుకున్నారు. తన సొంత గడ్డ నిజామాబాద్ మీదకు వచ్చిన తర్వాత కన్నీరు ఆగడం లేదని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. కష్టాలలో ఉన్న ఆడపిల్లను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి కర్కశంగా ప్రవర్తిస్తారా అంటూ కవిత ప్రశ్నించారు. తాను చూడని రాజకీయమా, తాను అనుభవించని పదవులా అని ప్రశ్నించారు. నిజామాబాద్ ప్రజలు తనను కడుపులో పెట్టుకొని చూసుకున్నారని, బతుకమ్మను ఎత్తుకొని వస్తే తనను అక్కున చేర్చుకున్నారని తెలంగాణ ఉద్యమం సమయం నాటి రోజులను కవిత గుర్తు చేసుకున్నారు.
అయితే ఈ సందర్భంగా సీఎం సీఎం అంటూ సభలో పలువురు నినాదాలు చేశారు. వారిని కవిత వారించారు. నిజామాబాద్ లో నిర్వహించిన పాంచ జన్య సంకల్ప సభలో ప్రసంగించిన కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. తనను తండ్రి నుంచి దూరం చేసిన ప్రశాంత్ రెడ్డికి తన ఉసురు తగులుతుందని తీవ్రభావోద్వేగానికి లోనయ్యారు. హరీష్ రావు, సంతోష్ రావులను క్షమించినా ప్రశాంత్ రెడ్డిని మాత్రం జీవితంలో క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.