ఆంధ్రప్రదేశ్ లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ ప్రకారం ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం తమదే అన్న ధీమా కూటమి పార్టీల నేతలలో కనిపిస్తోంది. అయితే 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన వైసీపీ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదేమో అని ఎన్నికలను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కోర్టులో కేసులు వేసినా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపి తీరతామని నారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణపై నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. పలు మున్సిపాలిటీల్లో 3300 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చూసి ఓర్వలేక ఓటమి భయంతోనే వైసీపీ నేతలు కోర్టులను ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు.
ఇంకా చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ నేతలకు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. వైసీపీ అంత దయనీయ పరిస్థితుల్లో ఉంది కాబట్టే రాష్ట్రంలో ఎక్కడా ఏకగ్రీవాలు జరగకూడదని జగన్ ఆదేశించారని నారాయణ విమర్శించారు.