ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ లీడర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy)కి త్వరలోనే అత్యున్నత రాజ్యాంగ పదవి దక్కనుందనే వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. కేంద్రంలో రాబోయే మంత్రివర్గ విస్తరణతో పాటు, పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పుపై బీజేపీ హైకమాండ్ కసరత్తు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ పార్టీని వీడి కమల దళంలో చేరిన తర్వాత, ఆశించిన స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయనకు ప్రాధాన్యత దక్కలేదనే టాక్ ఎప్పటినుంచో ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట(Rajampet) లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసినప్పటికీ, ఆయనకున్న పరిపాలనా దక్షతను గుర్తించి సముచిత స్థానం కల్పించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నేతలు, మాజీ ముఖ్యమంత్రులకు గవర్నర్ బాధ్యతలు అప్పజెప్పడం ద్వారా వారి అనుభవాన్ని ఉపయోగించుకోవడం ఆ పార్టీ వ్యూహంలో భాగమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
శాసనసభా వ్యవహారాలపై పూర్తి పట్టు ఉండటం, వివాద రహితుడిగా పేరుండటం కిరణ్ కుమార్ రెడ్డికి ప్రధాన సానుకూలాంశాలుగా మారుతున్నాయి. ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్న తరుణంలో, ఈ కీలక పదవి ఆయనకు దక్కితే ఆయన రాజకీయ ప్రయాణంలో మరో కొత్త అధ్యాయం మొదలైనట్టే అవుతుంది. అయితే ఇంతవరకు ఈ అంశంపై బీజేపీ(BJP) నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.