డిజాస్టర్ల పరంపరకు తెదరించుతూ.. ఇటీవలే ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో మంచి విజయాన్నందుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. దీని తర్వాత అతను చేయాల్సిన సినిమా ముందే ఖరారైంది. తన చెల్లెలు నిహారిక నిర్మాణంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ దర్శకుడు యదువంశీ దర్శకత్వంలో ‘బరి’ చేయబోతున్నాడు. ఈపాటికే ఈ సినిమా మొదలు కావాల్సింది కానీ.. వరుణ్ మోకాలి గాయం వల్ల కొంత ఆలస్యం అవుతోంది. ‘బరి’ పూర్తి చేశాక వరుణ్ చేసే సినిమా గురించి ఇప్పుడో క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. అతను తమిళ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్తో జట్టు కట్టే అవకాశాలున్నాయట.
‘పిజ్జా’ లాంటి సెన్సేషనల్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన కార్తీక్ సుబ్బరాజ్.. ఆ తర్వాత ‘జిగర్ తండా’ మరింత సంచలనం రేపాడు. ఆపై ఇరైవి, మహాన్ లాంటి సినిమాలతో అతను ఆకట్టుకున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్తో చేసిన ‘పేట’, ధనుష్తో తీసిన ‘జగమే తంత్రం’, ‘జిగర్ తండా’ సీక్వెల్ ‘జిగర్ తండా డబులెక్స్’ అంచనాలను అందుకోలేకపోయినా.. విలక్షణ దర్శకుడిగా కార్తీక్కు ఉన్న పేరు మాత్రం పోలేదు. సూర్యతో చేసిన ‘రెట్రో’ సైతం తన మార్కును చూపించింది. ప్రస్తుతం అతను కీర్తి సురేష్ సినిమా ‘డొరోతీ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
దీని తర్వాత కార్తీక్.. వరుణ్ తేజ్తో సినిమా చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఇద్దరి మధ్య ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయట. కార్తీక్ ఇప్పటిదాకా తెలుగు సినిమా చేయకపోయినా.. తనకు తెలుగులో మంచి ఫాలోయింగే ఉంది. డిఫరెంట్ సినిమాలు కోరుకునే ప్రేక్షకుల్లో అతడికి గుర్తింపు ఉంది. కార్తీక్, వరుణ్ కాంబోలో సినిమా వస్తే తెలుగులో మంచి క్రేజ్ ఉంటుందనడంలో సందేహం లేదు. వరుణ్కు కూడా తమిళ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇది మంచి సినిమా అవుతుంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తోంది.