వైసీపీ అధినేత జగన్కు ఎన్నికలు ముగిసిన రెండున్నరేళ్ల తర్వాత కూడా.. ప్రజల నుంచి సెగ తగులుతోంది. తాజాగా ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించేందుకు వెళ్లారు. పార్టీ నాయకుడు, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు ఆయన జిల్లా పర్యటన పెట్టుకున్నారు. అయితే.. జగన్ వస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువత పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం గమనార్హం. `జగన్ గోబ్యాక్` అని రాసి ఉన్న ఈ ఫ్లెక్సీలు జగన్ పర్యటన సాగే పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
అలానే.. `ఎస్సీల ద్రోహి..` అని రాసి ఉన్న ఫ్లెక్సీలు కూడా పర్యటన ప్రాంతంలో కనిపించాయి. అలానే.. ఎస్సీలకు అన్యాయం చేసిన విరూపాక్షిని పరామర్శించేందుకు రావడం సిగ్టు చేటు అని మరికొన్ని ఫ్లెక్సీలపై కనిపించింది. ఇలా.. జగన్ పర్యటనలో ఇప్పటి వరకు లేని విధంగా తాజాగా కర్నూలు పర్యటనలో ఈ తరహా ఘాటు ఫ్లెక్సీలు కని పించడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా హర్టయ్యారు. ఆ వెంటనే పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సదరు ఫ్లెక్సీలను తొలగించారు.
విరూపాక్షికి ఎందుకీ పరామర్శ!
కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే వైసీపీ నేత విరూపాక్షి సోదరుడికి.. టీడీపీకి చెందిన స్థానిక ఎస్సీ నాయకులకు మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలపై తొలుత టీడీపీ వారే దాడి చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో విరూపాక్షి సోదరుడిని.. టీడీపీ నేత దూషించారని.. ఈ ఆడియోను వైరల్ చేశారు. ఇలా ప్రారంభమైన రచ్చ.. ఏకంగా విరూపాక్షి.. టీడీపీ నేత ఇంటికి వెళ్లి యాగీ చేసేవరకు వచ్చింది. ఈపరిణామాలతో కర్నూలు జిల్లాలో 144 సెక్షన్ విధించి.. విరూపాక్షిపై కేసు నమోదు చేశారు. అనంతరం.. జైలుకు తరలించారు.
జైల్లో ఉన్న విరూపాక్షిని పరామర్శించేందుకు జగన్ తాజాగా తాడేపల్లి నుంచి కర్నూలుకు వచ్చారు. ఈ పర్యటన ద్వారా బీసీలను ఆయన తనవైపు తిప్పుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. విరూపాక్షి బోయ-బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో .. ఆ వర్గం సానుభూతి కోసం జగన్ ప్రయత్నిస్తున్నాడని టీడీపీనాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.