రాజకీయ తెరపై ఇప్పటివరకు తెరవెనుక వ్యూహాలు రచించి అగ్రనేతలను గెలిపించిన ప్రశాంత్ కిషోర్ (పీకే), ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోనూ తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. బీహార్(Bihar) రాజకీయాల్లో ఎవరూ ఊహించని సంచలనం సృష్టిస్తూ, బీజేపీకి దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న బాంకిపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఘనవిజయ్ సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హాపై ఏకంగా 20 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, రాజకీయ ప్రత్యర్థులకు గట్టి షాక్ ఇచ్చారు.
ఇది కేవలం ఒక ఉపఎన్నికల గెలుపు మాత్రమే కాదు, ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) స్థాపించిన 'జన్ సురాజ్' పార్టీకి రాజకీయ రంగప్రవేశంలో దక్కిన చారిత్రాత్మక తొలి విజయం. గతంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడంతో, ఇక ఆ పార్టీ కథ ముగిసిందంటూ విమర్శకులు ప్రచారం చేశారు. అయితే, ఆ విమర్శలన్నింటినీ పీకే తనదైన వ్యూహంతో తిప్పకొట్టారు. ఏడాది తిరిగేసరికి వచ్చిన బాంకిపూర్ ఉపఎన్నికను సవాల్గా తీసుకుని స్వయంగా బరిలోకి దిగి ఈ అద్భుత విజయాన్ని అందుకున్నారు.
సాధారణంగా బాంకిపూర్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా కేవలం బీజేపీ(BJP), ఆర్జేడీ మధ్యే ప్రధాన పోరు నడిచేది. ఈ సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ, తొలిసారిగా బరిలోకి దిగిన మూడో ప్రత్యామ్నాయ శక్తిగా జన్ సురాజ్ పార్టీ పాగా వేసింది. ఆగస్ట్ 3న ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్షణం నుంచే పీకే స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. ప్రతి రౌండ్లోనూ ఓట్ల ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయి ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఈ గెలుపుతో బీహార్ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయని, రాబోయే రోజుల్లో పీకే మరింత బలమైన శక్తిగా ఎదుగుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.